Jagtial: జగిత్యాల జిల్లా రూరల్ మండలం కల్లెడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విధి దెబ్బకు ఒక కుటుంబం చీలిపోయింది. అమ్మా–నాన్నా లేని లోకంలో ముగ్గురు కంటిపాపలు అనాథలయ్యారు. తల్లీ తండ్రుల్ని కోల్పోయిన కన్నీటి చూపులు, కల్లెడను కదిలించిన హృదయ విదారక ఘటన ఇది. విధి ఎంత క్రూరమో మరోసారి నిరూపించిన ఈ ఘటన, చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది.
జగిత్యాల జిల్లా రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన జ్యోతి (మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తలమాల వాస్తవ్యురాలు), పదిహేనేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్కు చెందిన గోపాల్ను ప్రేమించి వివాహం చేసుకుంది. చిన్న గుడిసెనే ఆశ్రయంగా చేసుకుని, కష్టమైనా సరే పిల్లలతో కలిసి జీవితం గడిపింది. అంజలి (13), చిన్ని (6), మురళి (5) వీరే ఆమె జీవితం. కానీ ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో భర్త గోపాల్ మృతి చెందడంతో కుటుంబానికి ఆధారం కోల్పోయింది. భర్తను కోల్పోయిన బాధను దిగమింగుకుని పిల్లల కోసం బతుకుతున్న జ్యోతి కూడా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం కన్నుమూసింది.
తల్లి మృతదేహం పక్కన కూర్చుని “అమ్మా… లేవమ్మా…” అంటూ ఆ ముగ్గురు చిన్నారులు పెట్టిన రోదన.. ఆ మౌన రోదన అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అంత్యక్రియలకు కూడా ఆర్థిక స్థోమత లేకపోవడంతో గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానికులు, మాజీ సర్పంచ్ అంకతి గంగాధర్, కారోబార్ సురేందర్ చొరవ తీసుకుని అంత్యక్రియలు నిర్వహించారు.
అంత్యక్రియలతో ముగియని విషాదం ఇది. ఇప్పుడు అసలైన ప్రశ్న మొదలైంది. ఈ ముగ్గురు చిన్నారుల భవిష్యత్తు ఎవరి బాధ్యత? నేడు వారికి అవసరం సానుభూతి కాదు. నిజమైన సహాయం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. బాలల సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు ముందుకు వచ్చి వారికి పునరావాసం కల్పించాలి. వారి చదువు, జీవితం, భద్రత పట్ల భరోసా కల్పించాలి. విద్యకు ఆటంకం కలగకుండా ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించాలి.
అలాగే దాతలు, స్వచ్ఛంద సంస్థలు, మనసున్న మనుషులు ముందుకు రావాల్సిన సమయం ఇదే. ఒక చిన్న చేయి, ఒక చిన్న సహాయం ముగ్గురు జీవితాలకు వెలుగు నింపగలదు. ఇది సమాజం మనిషిగా నిలబడుతుందా? లేదా? అనే పరీక్ష. ఇప్పుడే స్పందిద్దాం… మానవత్వాన్ని నిలబెట్టుకుందాం.
Read Also: శ్రీశైలం ఘాట్ రోడ్డులో లిఫ్ట్ అడుగుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త, మహిళ వీడియో వైరల్