Kalvakuntla Himanshu: తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) లో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్ 24,729 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మగంటి సునీత ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల ఫలితం కంటే, బీఆర్ఎస్ ప్రచారంలో కనిపించిన 17 ఏళ్ల మగంటి వాత్సల్యనాథ్ ధైర్యం, ఆ పార్టీని చుట్టుముట్టిన కుటుంబ డ్రామానే ప్రధాన చర్చనీయాంశమయ్యాయి. దివంగత ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్, ఆయన రెండో భార్య సునీతల కుమారుడైన వాత్సల్య ( Maganti Vatsalya), తండ్రి మరణం తర్వాత తల్లి ప్రచార బాధ్యతలను ముందుండి నడిపించాడు.
తండ్రిని కోల్పోయిన విషాదం నుంచి తేరుకుని, వాత్సల్య ఇంటింటి ప్రచారం నుంచి రోడ్ షోల వరకు చురుగ్గా పాల్గొనడం బీఆర్ఎస్ శ్రేణులను ఆకట్టుకుంది. ఈ క్లిష్ట సమయంలో వాత్సల్యకు కేటీఆర్ కుమారుడు, కేసీఆర్ మనవడు హిమాన్షు రావు అండగా నిలిచాడు. తమ 13 ఏళ్ల స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ, “నీ ధైర్యం చూసి గర్విస్తున్నా.. ఒక సోదరుడిగా నీకు ఎప్పుడూ అండగా ఉంటాను” అని హిమాన్షు ఫేస్బుక్లో పెట్టిన భావోద్వేగ పోస్ట్, ఇరు కుటుంబాల మధ్య బంధాన్ని చూపించింది.
ప్రచారం ఉత్సాహంగా సాగుతున్న తరుణంలో, కుటుంబ వివాదాలు బీఆర్ఎస్కు పెద్ద దెబ్బ తీశాయి. గోపీనాథ్ మొదటి భార్య కోసరాజు మాలినీ దేవి, ఆమె కుమారుడు తారక్… సునీత నామినేషన్ను సవాలు చేశారు. సునీతతో గోపీనాథ్ వివాహం చట్టబద్ధం కాదని, ఫ్యామిలీ సర్టిఫికెట్ ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, గోపీనాథ్ తల్లి మహానంద కుమారి మరణంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
ఈ నాటకీయ పరిణామాలు బీఆర్ఎస్కు రావలసిన సానుభూతి ఓటును గణనీయంగా దెబ్బతీశాయి. ఫలితాల్లో కాంగ్రెస్కు 98988 ఓట్లు రాగా, బీఆర్ఎస్ 74259 ఓట్లకే పరిమితమైంది. బీజేపీ 17061 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ప్రచారం, బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డాయి. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న వాత్సల్య, ఈ ఓటమిని తట్టుకుని రాజకీయ వారసుడిగా ఎదుగుతాడా, లేక తన మార్గాన్ని మార్చుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Kavitha: జూబ్లీహిల్స్ ఓటమిపై కవిత ట్వీట్.. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ అన్నకు కౌంటర్!