Kalvakuntla Kavitha: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆరోపించారు. ఈ రెండు పార్టీల పొత్తు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తొలిమెట్టు అన్నారు. బీఆర్ఎస్ మద్దతుతోనే బీజేపీ రాష్ట్రంలో ఒకటో, రెండో మున్సిపల్ చైర్మన్ పదవులు దక్కించుకుందన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలని, వృద్ధాప్య, దివ్యాంగ సహా ఇతర పింఛన్లను పెంచాలని, కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాలని, యువతులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు, మహిళలతో కలిసి మంగళవారం బేగంపేటలోని ప్రజాభవన్ ఎదుట బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ జోక్యం చేసుకొని మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు సహా ఇతర వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయించాలని నినాదాలు చేశారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
చివరకు పోలీసులు స్పందించి ప్రజావాణి అధికారులతో చర్చించి కవిత సహా ఆందోళనకారులను ప్రజాభవన్ లోపలికి అనుమతించారు. ప్రజావాణి స్పెషల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కరీంనగర్, నారాయణపేట్ లో బీఆర్ఎస్ హాజరుకాకపోవడంతోనే బీజేపీకి మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులు దక్కాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీల అంతర్గత సహకారం ఈ ఎన్నికలతో బహిర్గతం అయ్యిందన్నారు. నారాయణపేటలో జాగృతి నాయకురాలికి దక్కాల్సిన వైస్ చైర్ పర్సన్ పదవిని రెండు పార్టీలు కలిసి రాకుండా చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని గతంలో లీకులు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీల అమలుకు ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యమకారులు సహా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో సెక్రటేరియట్, అసెంబ్లీ ముట్టడిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో హామీల అమలుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను ఎగవేసి ప్రయత్నం చేస్తే జాగృతి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తుందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడం సంగతి తర్వాత ముందు ఇస్తామన్న రూ.2,500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంగన్ వాడీ కేంద్రాల నిర్వహణలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం జీవో ఇచ్చిందని, దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో పనిచేస్తున్న అంగన్ వాడీలను గ్రామ పంచాయతీల పరిధిలోకి తేవడం సరికాదన్నారు. గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించే అంగన్ వాడీలను యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఆశ కార్యకర్తలు, అంగన్ వాడీల జీతాలు చెల్లించకుండా సంక్షేమ పథకాలకు నిధులు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చెప్తున్నారని.. ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు అంగన్ వాడీలు, ఆశా కార్యకర్తలకు వేతనాలు ఇవ్వకపోవడం ఎలా సమంజసమవుతుందో చెప్పాలని నిలదీశారు.