Kalvakuntla Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన మహిళల ఉసురు తగులుతుందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలతో నిర్వాసితులైన బాధిత కుటుంబాలను సోమవారం (మార్చి 9) కవిత పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఒక ఆడబిడ్డ ఏడిస్తేనే ఇంటికి మంచిది కాదని.. అలాంటిది ఇంత మంది ఆడబిడ్డల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని అన్నారు.
పిల్లల పరీక్షల సమయంలో పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేశారని కవిత మండిపడ్డారు. ఇళ్లు కూల్చేస్తే కొందరు రాజకీయ నాయకులు వచ్చి.. ఎగ్జిబిషన్ చూసినట్లు చూసి వెళ్లిపోయారన్నారు. వాళ్ల తరహాలో తాను కూడా మిమ్మల్ని చూసి వెళ్లటానికి ఇక్కడకు రాలేదని.. సమస్యపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలతో పాటు జాగృతి కూడా మీకు తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఇల్లు కూల్చడమే కాకుండా బాధితులను ఒ కొట్టంలోకి తోలినట్లు ఒక దగ్గర పెట్టేశారని కవిత ఆరోపించారు. మహిళల కోసం ప్రత్యేక వసతి కూడా ఏర్పాటు చేయలేదన్నారు. హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు కనీసం హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకపోవటం దారుణమన్నారు. వెలుగుమట్లలో ఇంత జరుగుతున్న కలెక్టర్ ఒక్కరోజు కూడా రాలేదని తన దృష్టికి వచ్చిందని కవిత అన్నారు. ముగ్గురు మంత్రులు ఈ జిల్లాకు ఉంటే ఒక్కరికి కూడా సోయిలేదంటూ ఘాటు విమర్శలు చేశారు.
Also Read: Madhavi Latha: మగాళ్లపై మరోసారి రెచ్చిపోయిన మాధవీలత.. రె*ట్ట వేయడానికి కూడా పనికిరారంటూ!
ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు ఈ సమస్యపై వెంటనే మాట్లాడాలని.. జిల్లా కలెక్టర్ ఇక్కడకు వచ్చి సమస్యను పరిష్కరించాలని జాగృతి తరపున కవిత డిమాండ్ చేశారు. అదే విధంగా మన ఇళ్లు ఎక్కడ నేలమట్టం చేశారో.. అక్కడే కొత్తగా ఇళ్లు కట్టించి ఇవ్వాలని పట్టుబట్టారు. ‘వేరే చోటకు వెళ్లమంటే వెళ్లేది లేదు. ఇక్కడే ఇళ్లు కట్టించేలా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలి. రాష్ట్రం మొత్తం కూడా పేదల మీద జులుం నడుస్తోంది. పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లు పంపుతూ అన్యాయం గా వ్యవహరిస్తున్నారు.పెద్ద వాళ్ల బిల్డింగ్ ల జోలికి వెళ్లటం లేదు. వాళ్ల బిల్డింగ్ లు ఎక్కడివి అక్కడే ఉన్నాయి’ అని కవిత ఆరోపించారు.
Also Read: GITAM University: గీతం వర్సిటీపై వైసీపీ యుద్ధం.. ఎంపీ భరత్పై రూ. 5000 కోట్ల దోపిడీ ఆరోపణలు!