GITAM University: విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ భూములు , ఎంపీ భరత్ లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విద్యా సంస్థల ముసుగులో ఎంపీ భరత్ సుమారు రూ.5వేల కోట్లు దోచుకున్నారని కేకే రాజు ఆరోపించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లపై దాడులు చేసి, అక్రమాలను క్రమబద్ధీకరించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రీవెన్స్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలను, ఎంపీ ఆదేశాల మేరకు అధికారులు అడ్డుకున్నారని ఆయన ధ్వజమెత్తారు.
కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ గీతం యూనివర్సిటీలో అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయని, చంద్రబాబు నాయుడు బంధువు అయినందున భరత్కు వేల కోట్ల విలువైన భూములను కట్టబెట్టారని విమర్శించారు. పోలీసులు కూటమి నాయకులకు బానిసల్లా వ్యవహరించకూడదని.. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఈ భూ కబ్జాపై ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు.
టీడీపీ నాయకుల అవినీతి బీజేపీ నేతలకు ఎందుకు కనిపించడం లేదని వాసుపల్లి గణేష్ కుమార్ ప్రశ్నించారు. ఎంపీ భరత్ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని.. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గీతం భూములను స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను కచ్చితంగా కూలదోస్తామని స్పష్టం చేశారు.
Also Read: ట్రంప్ ఏం చెబితే మోదీ అది చేస్తారా? భువనగిరి ఎంపీ షాకింగ్ కామెంట్స్!