చేనేత కుటుంబాల పరిస్థితిపై మాట్లాడుతూ.. మనిషి నాగరికత బట్టతో ప్రారంభమవుతుంది. కానీ ఆ బట్టను నేసేవాళ్లు తమ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణలోనే కాదు భారత దేశంలో మొత్తంలో వారి పరిస్థితి దయనీయంగా ఉందని వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా సంప్రదాయ వృత్తులు నిర్వహిస్తున్న పద్మశాలి, నేత కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత కేసీఆర్ ప్రభుత్వం నేత కార్మికులకు పెన్షన్, నూలుకు సబ్సిడీ, మార్కెట్ సపోర్ట్ వంటి పలు పథకాలు ఇచ్చిందని, వాటి వల్ల వేలాది కుటుంబాలు ఆర్థిక భారం నుండి బయటపడ్డాయని కవిత గుర్తు చేశారు.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. చేనేత కార్మికులకు ఇచ్చే ప్రధాన సబ్సిడీలు నిలిపేశారని ఆరోపించారు. వారికి ప్రస్తుతం పెన్షన్ తప్ప మరే ఆధారం లేదు. సబ్సిడీలు ఆపేయడం వల్ల వ్యాపారం దెబ్బతింది. చాలామంది కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక చేనేత కుటుంబంలో ఒక్కరికి చేనేత పెన్షన్ వస్తే, ఆ కుటుంబానికి సాధారణ పెన్షన్ ఇవ్వకుండా ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.
చీర నేసినా కూడా వ్యాపారం చేయలేని పరిస్థితి. మార్కెట్ లేక, ముడి సరుకు ధరలు పెరగడం వల్ల నేత కార్మికులు దెబ్బతింటున్నారు అని ఆమె తెలిపారు. కొత్త తరాలు చేనేత వృత్తిని స్వీకరించేందుకు ఆసక్తి చూపట్లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
సరైన గిట్టుబాటు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ వృత్తిలో కొనసాగించేందుకు ఇష్టపడటం లేదు. ఇలాగే కొనసాగితే చేనేత కళ అంతరించే ప్రమాదం ఉంది అని తెలిపింది.
బీసీ వర్గాల్లో పద్మశాలి జనాభా అత్యధికమని తెలిసినా, ఏ రాజకీయ పార్టీ ఈ వర్గానికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని కవిత విమర్శించారు. ఏ ప్రధాన పార్టీ కూడా పద్మశాలీలకు కీలక పదవులు ఇవ్వడం లేదు. ఇది చాలా పెద్ద అన్యాయం. అన్ని పార్టీలు వారికి ప్రాధాన్యం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
Also Read: కడియం బాటలో దానం నాగేందర్.. స్పీకర్ నోటీసుపై రియాక్ట్
అదేవిధంగా బీసీలకు రాజకీయ పార్టీల ఆధారంగా కాకుండా.. రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. కొత్త కోట చేనేత కళాకారుల కష్టం చూశాను. బట్ట తయారీలో చాలా కష్టపడుతున్నారు. చేనేత కళను అభివృద్ధి చేయడంలో జాగృతి సంస్థ తన వంతు సహకారం అందిస్తుందని కవిత హామీ ఇచ్చారు.