Mahesh Kumar Goud: కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. స్థానిక సభ సాక్షిగానే నాయకుల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో సీనియర్లకు కనీస గౌరవం దక్కడం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న నేతలకు సైతం అవమానాలు ఎదురవుతున్నాయంటూ ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ఇటీవల కామారెడ్డి హిందూ స్మశాన వాటిక విషయంలో టీపీసీసీ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పిసిసి చీఫ్ సీరియస్ అయ్యారు.
మరో నేతను ఉద్దేశించి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపాయి. సీనియర్ నాయకులను ముసలి నక్క, కుంటి నక్క, గుడ్డి నక్క అంటూ ఆయన సంబోధించడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నాయకులకు ఇప్పుడిప్పుడే పదవులు వస్తున్నాయని, వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన హితవు పలికారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని గుర్తు చేశారు.
సీనియర్ నాయకులను కాదని, ఎవరికి నచ్చినట్లు వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అస్సలు సహించేది లేదని మహేష్ కుమార్ గౌడ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. షబ్బీర్ అలీ లాంటి సీనియర్ నేతను పక్కనబెట్టి ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని, ఒంటెద్దు పోకడలకు పోతే నష్టపోతారని స్పష్టం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులను గౌరవించుకుంటూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
Also Read:బాల్క సుమన్ని మెంటల్ హస్పిటల్లో చేర్పించండి: మెట్టు సాయికుమార్!