కామారెడ్డి రాజకీయాల్లో వేడి రాజుకుంది. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, షబ్బీర్ అలీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోయిన కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ అన్నీ తానే అన్నట్టు వ్యవహరించడంపై వెంకటరమణ రెడ్డి మండిపడ్డారు. తనను అవినీతి చక్రవర్తిగా అభివర్ణించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి తన రాజకీయ గురువని స్పష్టం చేశారు.
వైఎస్సార్ ఇచ్చిన అవకాశంతోనే తాను కౌన్సిలర్, జెడ్పీటీసీ పదవులు చేపట్టానని వివరించారు. షబ్బీర్ అలీ గతంలో తన తండ్రి వద్ద వినయంగా ఉండేవారని ఎద్దేవా చేశారు. ఆయన కట్టిన ఐదంతస్తుల భవనానికి కనీసం మున్సిపల్ అనుమతి లేదని ఆరోపించారు. షబ్బీర్ అలీ తీరు వల్లే తాను గతంలో కాంగ్రెస్ నుండి బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు.
అసెంబ్లీలో హుందాగా ఉండాలని తాను భావించినప్పటికీ.. ప్రత్యర్థులు తనను చీప్ గా మాట్లాడేలా ప్రేరేపించారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నిందలు వేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూశారని హెచ్చరించారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను వద్దని చెప్పినా తన అనుచరులు, కార్యకర్తలు వేలాదిగా తరలి రావాలని మెసేజ్ లు పెట్టడం గమనార్హమన్నారు. ఆదివారం నుండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వస్తానని, తనను ఎవరు అడ్డుకుంటారో చూస్తానని ధీమా వ్యక్తం చేశారు.
బాన్సువాడలో జరిగిన గొడవలను తానే స్వయంగా చొరవ తీసుకుని సద్దుమణిగేలా చేశానని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన 263 ఎకరాల భూమిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. అందులో ఒక్క గజం భూమి అమ్మినట్లు నిరూపించినా తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఈ ప్రాంతంలో దొంగలెవరో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. తన ప్రాణాలకు ఏమైనా హాని జరిగితే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రేపటి నుండి తాను యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. ఇది నేరుగా సీఎంకు, తనకు మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన తేల్చి చెప్పారు.
ALSO READ: Harish Rao: పోలీసుల తీరుపై హరీష్ రావు ఆగ్రహం.. అసెంబ్లీలో తేల్చుకుంటామని సంచలన వ్యాఖ్యలు