Legal Adoption: స్వేచ్ఛ బ్యూరో: పిల్లలు లేని దంపతులు చట్టపరమైన నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవడం ద్వారా ఆ బిడ్డకు ఉజ్వల భవిష్యత్తును అందించవచ్చని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ – మిషన్ వాత్సల్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు దంపతులకు ఆమె దత్తత ఉత్తర్వులను అందజేశారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన ఓ దంపతులకు సంతానం లేకపోవడంతో, వారు తమ రక్తసంబంధీకుల నుండి ఒక పాపను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం అన్ని ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం, మంగళవారం కలెక్టర్ చేతుల మీదుగా సదరు దంపతులకు పాపను చట్టబద్ధంగా అప్పగిస్తూ దత్తత ఉత్తర్వులను అందజేశారు. వీరితో పాటు హన్మకొండ మరియు హైదరాబాద్కు చెందిన మరో ఇద్దరు దంపతులకు కూడా చట్టపరమైన దత్తత పత్రాలను కలెక్టర్ పంపిణీ చేశారు.
Also read: అత్వెల్లిలో నారాయణ స్కూల్ అరాచకం.. విద్యాశాఖ నిబంధనలు బేఖాతర్!
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. “దత్తత తీసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. ముఖ్యంగా రక్తసంబంధీకుల నుండి దత్తత తీసుకోవాలన్నా చట్టపరమైన అనుమతులు తప్పనిసరి. దీనివల్ల భవిష్యత్తులో బిడ్డకు, తల్లిదండ్రులకు ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు కలగవు” అని సూచించారు. దత్తత ప్రక్రియపై ఆసక్తి ఉన్నవారు జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి (డీసీపీవో) పర్వీన్, పీఓ తిరుపతి, ఎల్సీపీవో రాజు, శిశుగృహ ఇన్ఛార్జ్ మేనేజర్ ఏ. అపూర్వ, డేటా అనాలిస్ట్ రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also read: నీట్ లీకేజీ మిస్టరీ.. ప్రింటింగ్ ప్రెస్ లోనే అసలు కథ మారిందా?