Bandi Sanjay: కరీంనగర్ జిల్లాలో వడ్ల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు రాజకీయ సెగలు పుట్టిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖాజీపూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెళ్లబోసుకోగా, రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.
కళ్లాల్లో రైతుల కన్నీరు
వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వారాల తరబడి కళ్లాల్లోనే పడిగాపులు కాస్తున్నామని, అయినా కొనే నాథుడే లేడని రైతులు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘తాలు, తరుగు’ పేరుతో ఒక్కో బస్తాకు నాలుగైదు కేజీల చొప్పున కోత విధిస్తూ దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారని వారు వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం
రైతుల కష్టాలను చూసి చలించిన బండి సంజయ్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించారు. ‘ప్రతి గింజకు కేంద్రమే పైసలిస్తోంది, పైగా వడ్లు కొన్నందుకు రాష్ట్రానికి కమీషన్ కూడా ఇస్తున్నాం. మరి కొనడానికి మీకున్న అబ్బంతరం ఏమిటి?’ అని ఆయన నిలదీశారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే, ఇప్పటివరకు కేవలం 15 లక్షల మెట్రిక్ టన్నులే కొనడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. టోకెన్ల జారీలో కూడా కమీషన్లు దండుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్మెంట్పై విమర్శలు
కేవలం రైతులనే కాకుండా విద్యార్థులను కూడా ఈ ప్రభుత్వం వంచించిందని సంజయ్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని, కేంద్రం నిధులు మంజూరు చేసినా వాడలేని స్థితిలో రాష్ట్రం ఉందని దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీల అమలుకు, ఉద్యోగుల జీతాలకు పైసల్లేవని చెప్పే ప్రభుత్వం.. ఢిల్లీకి కప్పం కట్టడానికి, ఇతర రాష్ట్రాల ఎన్నికల ఖర్చుల కోసం వేల కోట్లు ఎక్కడి నుండి తెస్తోందని ప్రశ్నించారు.
కేసీఆర్ అరెస్ట్ – సీబీఐ డ్రామాలు
మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై నివేదిక వచ్చి ఏడాదిన్నర అవుతున్నా చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. ‘ఇన్నాళ్లూ కేసీఆర్తో బేరసారాలు సాగించి, అవి కుదరకే ఇప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తున్నారా?’ అని ఎద్దేవా చేశారు. తమ భుజంపై తుపాకీ పెట్టి కేసీఆర్ను కాల్చాలని చూడొద్దని, దమ్ముంటే రేవంత్ రెడ్డే కేసీఆర్ను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.
తక్షణ డిమాండ్లు
రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వడ్ల కొనుగోలును పూర్తి చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తాలు, తరుగు పేరుతో కోతలు లేకుండా కనీస మద్దతు ధరను రైతులకు అందించాలని, లేనిపక్షంలో మంత్రులు గ్రామాల్లో తిరగని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
Also Read: ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్లో విషాదం.. ఫ్లైఓవర్ పిల్లర్ను ఢీకొట్టిన క్యాటరింగ్ వాహనం.. ఒకరు మృతి!