పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ కరీంనగర్ నగరంలో ఒక ఆసక్తికరమైన, ఆలోచింపజేసే సంఘటన చోటుచేసుకుంది. నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మిస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ అటకెక్కిందంటూ కరీంనగర్ కు చెందిన కోట శ్యామ్ కుమార్ అనే యువకుడు వినూత్న రీతిలో తన నిరసనను వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నగర ప్రజల దైవభక్తిని, ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పటి మంత్రి గంగుల కమలాకర్, టిటిడి అధికారుల సమక్షంలో ఆలయ నిర్మాణానికి అత్యంత వైభవంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం జరిగి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కేవలం భూమి పూజ చేసిన శిలాఫలకం మాత్రమే అక్కడ దర్శనమిస్తుండటంపై స్థానికుల్లో అసహనం వ్యక్తమవుతోంది.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరూ ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తుతుంటే.. శ్యామ్ కుమార్ మాత్రం నిర్మాణం ఆగిపోయిన టిటిడి ఆలయ స్థలం వద్దకు చేరుకుని తన ఆవేదనను వెళ్లగక్కారు. కోట్లాది రూపాయల నిధులతో, అద్భుతమైన శిల్పకళతో ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పి, ఇప్పుడు ఆ ప్రాజెక్టును గాలికి వదిలేయడంపై ఆయన మండిపడ్డారు. అధికారులు, పాలకులు మారినా భక్తుల కల మాత్రం నెరవేరడం లేదని ఆయన విమర్శించారు.
ఈ సందర్భంగా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ.. ‘టిటిడి ఆలయం వస్తే కరీంనగర్ జిల్లా మరో ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని భక్తులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ మూడేళ్లుగా కేవలం శిలాఫలకానికే ఈ ప్రాజెక్టు పరిమితం కావడం బాధాకరం. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం, టిటిడి ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నిధులు విడుదల చేసి, నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి’ అని డిమాండ్ చేశారు.
కరీంనగర్ నగర నడిబొడ్డున స్వామి వారి ఆలయం నిర్మిస్తామన్న హామీని విస్మరించడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వినూత్న నిరసన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: Most Gold mines: ఈ 7 దేశాల్లోనే వరల్డ్ బిగ్గెస్ట్ గోల్డ్ మైన్స్.. టాప్లో ఉన్న కంట్రీ ఏదో తెలుసా..?