Diamond Jewellery Robbery: కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో పట్టపగలే జరిగిన ఒక భారీ దోపిడీ ఉదంతం కలకలం రేపింది. హున్సూర్ పట్టణంలోని ‘స్కై గోల్డ్ అండ్ డైమండ్స్’ షోరూంలో ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు సినీ ఫక్కీలో విరుచుకుపడి.. సుమారు రూ. 10 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఈ దోపిడీని ముగించి పరారు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఆదివారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో.. ముఖాలకు మాస్కులు ధరించిన ఐదుగురు దుండగులు రెండు మోటార్ సైకిళ్లపై షోరూం వద్దకు చేరుకున్నారు. లోపలికి ప్రవేశించిన వెంటనే వారు తమ వద్ద ఉన్న తుపాకులతో సిబ్బందిని, వినియోగదారులను బెదిరించారు. ప్రతిఘటిస్తే కాల్చివేస్తామని హెచ్చరిస్తూ అందరినీ ఒక మూలకు చేర్చారు.
ముందుగా పక్కా స్కెచ్తో వచ్చిన దుండగులు.. షోరూంలోని షోకేసుల్లో ఉన్న ఖరీదైన వజ్రాల హారాలు, బంగారు ఆభరణాలను వేగంగా బ్యాగుల్లో సర్దుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. దుండగులు లోపలికి వచ్చిన సమయం నుంచి దోపిడీ ముగించుకుని బయటకు వెళ్లే వరకు పట్టిన సమయం కేవలం ఐదు నిమిషాలే. దోపిడీ అనంతరం వారు హున్సూర్-మడికేరి రహదారి వైపు వేగంగా పరారయ్యారు.
షోరూం యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో మైసూర్ జిల్లా ఎస్పీ సహా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. దుండగుల కదలికలు వారు వాడిన వాహనాల వివరాల కోసం చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సరిహద్దు జిల్లాలైన కొడగు, హాసన్ పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.
ఈ ఘటనతో మైసూర్ పరిసర ప్రాంతాల్లోని నగల వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు. పట్టపగలు, రద్దీగా ఉండే ప్రాంతంలో ఇంత పెద్ద దోపిడీ జరగడం గమనార్హం.
AlSO READ: Hyderabad: భాగ్యనగరంలో జింక మాంసం కలకలం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఎస్వోటీ బృందం
తుపాకులతో బెదిరించి రూ.10 కోట్ల ఆభరణాల చోరీ!
కర్ణాటక మైసూర్లోని స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో సినీ ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఐదు నిమిషాల్లో రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను దుండగులు ఎత్తుకెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం హున్సూర్లోని జ్యువెలరీ షాపులోకి మాస్కులు వేసుకున్న… pic.twitter.com/oPUywgTtzQ
— ChotaNews App (@ChotaNewsApp) December 30, 2025