బీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు కొత్త రంగును పులుముకున్నట్టు తెలుస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వలేదని కొందరు నేతలు కొత్త రాజకీయాలకు తెరలేపినట్టు తెలుస్తున్నది. మొన్నటివరకు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమైతే ప్రస్తుతం కిందిస్థాయి కీలక నేతలు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పార్టీలో మొదటి నుంచి ఉన్న తమకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా డబ్బులు పంచే వారికి టికెట్ అమ్ముకోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు సీనియర్లు మున్సిపల్ ఎన్నికల్లో రెబల్గా పోటీలో దిగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన కొందరు సీనియర్ గులాబీ నేతలు స్వతంత్రంగా పోటీకి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.అంతటితో ఆగకుండా అధికార కాంగ్రెస్, బీజేపీ వైపు దిక్కులు చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఎక్కడైతే టికెట్ ఆశించి భంగపడ్డారో అక్కడ తనకు టికెట్ కేటాయిస్తే పక్కపార్టీలోకి వెళ్లేందుకు నేతలు సిద్ధంగా ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. అయితే, కీలక నేతలు చేయి జారిపోకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జిల్లా నేతలు, మాజీ మంత్రులను పంపించి సదరు నేతను శాంతిపరచాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే, నేతల బుజ్జగింపులు అంతా సజావుగా సాగడం లేదని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రులు, జిల్లా నేతలు బతిమిలాడినా కొందరు లీడర్లు వినడం లేదని టాక్.
గత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి.ముందుగా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను అధికార కాంగ్రెస్, బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాయి. దీనికి తోడు తాజాగా సిట్ కేసులు, చార్జిషీట్ అంశాన్ని మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ రెండుపార్టీలు భావిస్తున్నాయి. అయితే, టికెట్ రాని కొందరు బీజేపీ, కాంగ్రెస్ నేతలతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. పరోక్షంగా మీ గెలుపునకు సాయం చేస్తామని..అందుకు కార్యకర్తలను, తమకు కోరింది ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నట్టు తెలుస్తోంది. దీంతో గులాబీ పార్టీ కారు గుర్తు మీద నిలబడిన అభ్యర్థులు చాలా ఓడిపోయేప్రమాదం ఉన్నది.
YSRCP : లడ్డూ రాజకీయం ఇంకెన్నాళ్ళు?
బీఆర్ఎస్ పార్టీలో కట్టప్పలు చాలా మందే ఉన్నట్టు ఈ ఒక్క ఘటనతో తెలిసిపోయిందని పలువురు చర్చించుకుంటున్నారు. టికెట్ ఇస్తారా? లేదా వేరే పార్టీలోకి వెళ్లిపోవాలా? అది కాదంటే రెబల్గా పోటీ చేయాలా? అని కొందరు నేతలు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జిల్లా ఇన్చార్జిలను బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు తెలుస్తుండగా.. మరికొంతమంది కాషాయ కండువా కప్పుకున్నట్టు సమాచారం. ముందు నుంచి పార్టీ కోసం సిన్సియర్గా పనిచేస్తున్న తమకు నామినేటెడ్ పదవులు కూడా రాలేదని.. గతంలో వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇచ్చారని.. ఇప్పుడు కూడా తమకు టికెట్ ఇవ్వనప్పుడు ఈ పార్టీలో ఉండి ఏం చేయాలని కొందరు పార్టీపెద్దలను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇకపోతే గులాబీ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదని ప్రచారం జరుగుతోంది. సిట్ అధికారులు ఎన్నికల ముందే బీఆర్ఎస్ కీలక నేతలను అరెస్టు చేస్తే ప్రచారంలో వెనకబడటమే కాకుండా ఫలితాలు సైతం తారు మారు అయ్యే అవకాశం లేకపోలేదు.