Kavitha: ఇటీవల ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తాజాగా బీసీల హక్కుల సాధన కోసం గళం విప్పారు. తన పాదయాత్ర ద్వారా ప్రజల నాడిని తెలుసుకున్న కవిత, ఇప్పుడు సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండల కేంద్రంలో గత 40 రోజులుగా బీసీ సంఘాలు చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఆమె సందర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో జరుగుతున్న ఈ దీక్షలో కవిత పాల్గొని వారికి పూర్తి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ల కోసం గతంలోనే తాను దీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు సరిపోవని, పార్లమెంటులో చట్టబద్ధంగా బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ బీసీలకు సరైన వాటా దక్కేలా చట్టం వచ్చేంతవరకు ఈ పోరాటం ఆగకూడదని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజలందరూ ఎలాగైతే ఏకతాటిపైకి వచ్చారో, ఇప్పుడు బీసీలు కూడా అదే స్ఫూర్తితో ఐక్యంగా ఉవ్వెత్తున ఎగిసిపడితేనే హక్కులు సాధించుకోగలమని స్పష్టం చేశారు.
భవిష్యత్తు కార్యచరణపై మాట్లాడుతూ.. అవసరమైతే ఈ ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని కవిత హెచ్చరించారు. హక్కుల సాధన కోసం రైల్ రోకోలు, రాస్తారోకోలు, ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. బీసీలు కేవలం ఎమ్మెల్యేలు, మంత్రులుగా మిగిలిపోకూడదని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా బీసీ వర్గం నుండే అయ్యే దిశగా మనమంతా కలిసికట్టుగా ఉద్యమించాలని ఆకాంక్షించారు. బీసీల ఐక్యత చూస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందని, జాగృతి అధ్యక్షురాలిగా వారి పోరాటంలో తాను ఎప్పుడూ ముందుంటానని కవిత భరోసా ఇచ్చారు.
Read Also: Top 20 News Today: కేటీఆర్కు హైకోర్టులో ఊరట, టీచర్గా మారిన కలెక్టర్