ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలుగుమట్ల భూ నిర్వాసితుల పక్షాన తెలంగాణ జాగృతి పోరాటం ఉధృతం చేసింది. బాధితులకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మంగళవారం నాడు తెలంగాణ జాగృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ నాయకులు సంయుక్తంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బాధితుల గొంతుకగా నిలబడతామని భరోసా ఇచ్చారు.
వెలుగుమట్ల భూ బాధితుల సమస్యలను రాష్ట్రస్థాయిలో బలంగా వినిపించామని ఆమె పేర్కొన్నారు. గతంలో ఏ రాజకీయ పార్టీ లేదా స్వచ్ఛంద సంస్థ కూడా ఈ స్థాయిలో బాధితుల పక్షాన నిలబడలేదని గుర్తుచేశారు. నిర్వాసితుల ఆకాంక్షలు నెరవేరే వరకు తమ పోరాటం వివిధ రూపాల్లో కొనసాగుతుందని హెచ్చరించారు. బాధితుల ఇళ్లను ఎక్కడైతే కూల్చివేశారో.. సరిగ్గా అదే ప్రాంతంలో ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వాదనలను తప్పుబడుతూ ఆ భూమి ప్రభుత్వానిది కాదని కవిత తేల్చిచెప్పారు. అది కేవలం భూదాన్ భూమి మాత్రమేనని.. ఆ భూములపై పేదలకు పూర్తి హక్కు ఉంటుందని వివరించారు. భూదాన్ సిద్ధాంతం ప్రకారం ఆ స్థలాలు పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అక్రమంగా ఇళ్లు కూల్చివేసి పేదలను రోడ్డున పడేయడం అమానుషమని మండిపడ్డారు.
న్యాయం లభించే వరకు నిర్వాసితులకు అండగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు పునరావాసం కల్పించాలని కోరారు. ఈ ఆందోళనలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలిసేలా పోరాడతామని వారు ప్రతిన పూనారు.