Kalvakuntla Kavitha: కాళేశ్వరం ప్రాజెక్టుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు వల్ల కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
కవిత మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్కసారి తప్ప ఎప్పుడూ ప్రయోజనం కలగలేదని స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అధిక వర్షపాతం ఉండటంతో సహజంగానే నీటి అవసరం తక్కువగా ఉందని, అలాంటి సమయంలో కూడా ఈ ప్రాజెక్టు ప్రజలకు పెద్దగా ఉపయోగపడలేదని ఆమె అభిప్రాయపడ్డారు. వర్షాలు బాగా కురవడంతో పనికిరాకుండా పోయిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఏ విధమైన ప్రత్యక్ష లాభం చేకూరలేదు అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇదే కాకుండా కాళేశ్వరం ద్వారా నిజంగా లాభపడింది ప్రజలు కాదని, కాంట్రాక్టర్లు మాత్రమేనని కవిత ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు వాస్తవంగా ఎవరి కోసం పనిచేసిందనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు. కాంట్రాక్టర్లకు తప్ప సామాన్య రైతుకు, ప్రజలకు ఏమి దక్కలేదు అంటూ ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రత్యేకంగా ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాలకు అదనంగా ఏమీ రాలేదని, కాళేశ్వరం వల్ల ఈ ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిన దాఖలాలు లేవని ఆమె స్పష్టం చేశారు. కాళేశ్వరం కంటే నిజాంసాగర్ ప్రాజెక్టే ఎంతో మెరుగైనదని, అది నిజంగా రైతులకు ఉపయోగపడిందని కవిత వ్యాఖ్యానించడం మరింత కలకలం రేపింది.
ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ, నిజాంసాగర్లో పేరుకుపోయిన మట్టిని వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఒకప్పుడు నిజాంసాగర్ మంచి పర్యాటక కేంద్రంగా, ప్రకృతి అందాలతో కళకళలాడేదని, ఇప్పుడు మాత్రం ఆ పర్యాటక శోభ పూర్తిగా కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సంరక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు.
ఈ ప్రాజెక్టు బదులు నిజాం సాగరే బెస్ట్ అంటూ తన తండ్రి కట్టించిన కాళేశ్వరాన్ని లైట్ చేస్తూ.. హాట్ కామెంట్స్ చేశారు కవిత. వీటి వల్ల కాంట్రాక్టర్లకు తప్ప ప్రజలకు ఎలాంటి లాభం లేదని తేల్చి చెప్పేశారు. అంతే కాదు ఇవన్నీ మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్లు కంప నోరేసుకుని పడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత.
కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు పెరిగాయని, వేల కోట్ల రూపాయల రుణ భారాన్ని తెలంగాణ ప్రజలు మోయాల్సి వస్తోందని కవిత విమర్శించారు.
Also Read: రాజ్యాంగ స్ఫూర్తి పై అవగాహనకు 5కే రన్.. ఏక్ నయీ దిశ ఫౌండేషన్ వినూత్న ప్రయత్నం
మొత్తానికి, కాళేశ్వరం ప్రాజెక్టుపై జాగృతి కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాలను మరోసారి వేడెక్కించాయి. ఇది కేవలం రాజకీయ విమర్శగానే ఆగుతుందా? లేక భవిష్యత్తులో పెద్ద స్థాయి దర్యాప్తులకు, చర్చలకు దారితీస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.




















