Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆమె తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా.. విచారణ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే పార్టీ అంతర్గత పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతున్న తీరును కవిత తీవ్రంగా విమర్శించారు. రెండేళ్లు గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. విచారణ ప్రక్రియను ‘స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్లు ఉంది’ అని అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును త్వరగా ముగించాలనే ఉద్దేశంతో లేదని.. కేవలం కాలయాపన చేస్తోందని ఆమె ఆరోపించారు. నిజమైన నేరస్తులు బయటకు వస్తారనే నమ్మకం తనకు లేదని.. ఇది కేవలం ఒక టైమ్ పాస్ విచారణలా సాగుతోందని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ను విచారించడంపై స్పందిస్తూ.. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటి విచారణలను ఎదుర్కోవాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, విచారణకు అందరూ సహకరించాలని కోరారు. ఈ విషయంలో తన సోదరుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె విభేదించింది. విచారణకు పిలవడం నేరమని కేటీఆర్ అనడం సరికాదని, విచారణ నిష్పక్షపాతంగా జరగడానికి అందరూ సహకరించాలని సూచించారు. ఒకవేళ ఈ కేసులో తనను విచారణకు పిలిచినా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
అన్నింటికంటే ముఖ్యంగా BRS పార్టీ పనితీరుపై ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పార్టీ ఆలోచనా విధానంలో మార్పు రానంత వరకు BRSను ఎవరూ బాగు చేయలేరని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా అంతర్గతంగా సమీక్షించుకోవాలని, లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. తన ఫోన్తో పాటు తన భర్త ఫోన్ కూడా ట్యాప్ అయి ఉండవచ్చనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు.
మొత్తానికి కవిత వ్యాఖ్యలు అటు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే, ఇటు సొంత పార్టీలోని లోపాలను ఎత్తిచూపేలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం గుంటనక్కలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని కేసును నీరుగారుస్తోందని ఆరోపిస్తూనే.. విచారణ వేగవంతం చేసి దోషులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read: శ్రీలంకలో చిక్కుకున్న 60 మంది తెలుగు పర్యాటకులు.. తిండి, వసతి లేక విలవిల!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన కవిత
కేసులో ఏం జరిగిందో నాకు తెలియదు
చట్టానికి ఎవరూ అతీతులు కాదు
ప్రజా జీవితంలో ఉన్నప్పుడూ ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavita reacts on Phone Tapping Case pic.twitter.com/pIAxuuMDFv
— BIG TV Breaking News (@bigtvtelugu) February 2, 2026