తెలంగాణ జాగృతిలో మొదటిసారి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్, ఆయన అనుచరులు కవిత సమక్షంలో చేరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. కేటీఆర్, హరీశ్రావులకు పరోక్షంగా చురకలంటించారామె. ప్రజా సమస్యలపై తాము పోరాటం చేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆరెస్ పార్టీ ఫోటోలకు ఫోజులిచ్చి పోతున్నదని విమర్శించారు.
ఏదైనా సమస్య వస్తే ప్రశ్నిస్తాం.. పోరాడుతాం.. పరిష్కరిస్తాం.. ఈ మూడు చేయటం ద్వారా ప్రజలకు మరింత చేరువవుతామన్న ఆమె.. బీఆరెఎస్ మాత్రం మధ్యలోనే పారిపోతున్నదన్నారు. ఏదో అలా వచ్చి ఇలా వెళ్లి.. ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోతున్నారని, అందుకే వారిపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరిగేది తెలంగాణ జాగృతి గురించేనని, ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్నే చూస్తున్నారని ఆమె ప్రకటించేసుకున్నారు ఈ వేదికగా.
పనిలో పనిగా ఆమె గడీల పాలనకు చరమగీతం పాడుతామని కూడా గద్వాల రాజకీయాలనుద్దేశించి మాట్లాడారు. గడీల పాలన అనగానే గుర్తొచ్చేది బీఆరెఎస్ పార్టీ. కేసీఆర్ పాలన. మొన్ననే ఆదిలాబాద్లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా గడీల పాలనను మళ్లీ రానీయ్యనని, ప్రజలు ఆ గడీల పాలనపై విపరీతమైన కోపంతో ఉన్నారని అన్నారు.
ఓ వైపు కవిత, మరో వైపు రేవంత్ … బీఆరెస్పై మాటల దాడులు చేస్తుండటంతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతున్నది. పార్టీ పెట్టకముందే తమది ప్రధాన ప్రతిపక్ష పాత్ర అని ప్రకటించుకున్న కవిత.. ఇక ఈనెల 25న పార్టీ ఏర్పాటు తరువాత మరింత దూకుడుగా ప్రజా ఉద్యమాలు చేస్తామని ఆమె ప్రకటించుకున్నారు. బీఆరెస్కు కవిత వ్యవహారం పంటికింద రాయిలా మారింది. తమ పాలన లోపాలతో పాటు..సందర్భం వచ్చిన ప్రతీసారి బీఆరెస్ను ఆమె టార్గెట్ చేసి మాట్లాడటం.. ఆమె మాటలకు ఎవరూ కనీసం ఖండించకపోవడం.. సమాధానమివ్వకపోవడంతో గులాబీ దళంలో గందరగోళం నెలకొన్నది.
మరోవైపు నాతో బీఆరెస్ నేతలు చాలా మంది టచ్లో ఉన్నారని ఆమె పదే పదే వ్యాఖ్యానించడం కూడా ఆ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన నెలకొన్నది. కవిత పార్టీ ప్రకటన తరువాత పాలసీ విధానాన్ని బట్టి పార్టీలో చేరితే లాభముంటుందా లేదా అనే చర్చలు ఇప్పట్నుంచే మొదలయ్యాయి.