Cancer Reporting: స్వేచ్ఛ బ్యూరో: ప్రతీ ఏటా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ ను నోటిఫైడ్ డీసీజ్గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ ప్రత్యేకంగా జీవో నెంబరు 17 ను రిలీజ్ చేశారు. ఈ నిర్ణయంతో కేసులు స్క్రీనింగ్, టెస్టింగ్, ట్రేసింగ్ తో పాటు ట్రీట్మెంట్ లోనూ పకడ్భందీగా మార్పులు రానున్నాయి. తద్వారా క్యాన్సర్ కేసులను వేగంగా గుర్తించి ప్రజల ప్రాణాలను కాపాడవచ్చనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉన్నది.ఇక నుంచి రాష్ట్రంలోని ఏ మూల క్యాన్సర్ కేసు నమోదైనా, ఆ వివరాలు ప్రభుత్వం వద్ద నమోదు తప్పనిసరి. ప్రస్తుతం కేవలం నిమ్స్, ఎంఎన్జే వంటి కొన్ని ప్రభుత్వ సంస్థల్లో మాత్రమే క్యాన్సర్ రిజిస్ట్రీలు ఉండగా, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఒకే గొడుగు కిందకు ఈ డేటాను తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా పోర్టల్ ను కూడా తయారు చేశారు.
క్యాన్సర్ నిర్ధారణ అయిన బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూనే, ఆ సమాచారాన్ని నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి అందజేయాలని నిబంధన విధించారు. ఏ ఆస్పత్రిలోనైనా లేదా డయాగ్నోస్టిక్ ల్యాబ్ లోనైనా క్యాన్సర్ నిర్ధారణ అయితే, ఆ విషయాన్ని నెల రోజుల్లోపు ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక పోర్టల్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇన్-సిటు (ప్రారంభ దశ), ఇన్వాసివ్ క్యాన్సర్లు ఇలా ఏ రకమైన క్యాన్సర్ అయినా సరే, దాని పూర్తి వివరాలను ఆన్ లైన్ ద్వారా వెల్లడించాలి. ఇందుకోసం జిల్లా స్థాయిలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు (డీఎంహెచ్వో) పర్యవేక్షణ బాధ్యతలు చేపడతారు. ఆస్పత్రులన్నీ తప్పనిసరిగా క్యాన్సర్ రిజిస్టర్ ను నిర్వహించాల్సి ఉంటుంది.ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త ఉత్తర్వులు కేవలం ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని అన్ని రకాల వైద్య సంస్థలకు వర్తిస్తాయి. కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ క్లినిక్కులు, నర్సింగ్ హోమ్లు, ఆయుష్ ఆస్పత్రులతో పాటు ఎయిమ్స్, ఈఎస్ఐ, రైల్వే, మిలిటరీ ఆస్పత్రులు కూడా ఈ నిబంధనను పాటించి తీల్సిందేనని సర్కార్ సూచించింది.
Also read: ఆ పథకానికి ప్రభుత్వం స్వాహా.. 62 వేల చీరలను వెనక్కి పంపిన సర్కార్!
రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ఈ డేటా మొత్తాన్ని క్రోడీకరించడానికి హైదరాబాద్ లోని మెహదీ నవాజ్ జంగ్ ( ఎం ఎన్ జే ) క్యాన్సర్ ఆస్పత్రిని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆస్పత్రి అధికారులు డేటాను నిశితంగా పరిశీలించి, రాష్ట్ర స్థాయి క్యాన్సర్ రిజిస్ట్రీని నిర్వహిస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ సి ఎమ్మార్) ప్రమాణాలకు అనుగుణంగా ఈ డేటాను జాతీయ స్థాయి రిజిస్ట్రీకి కూడా అనుసంధానిస్తారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఏ రకమైన క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, మరణాల రేటు ఎలా ఉంది అనే విషయాలపై స్పష్టత వస్తుంది. తద్వారా భవిష్యత్తులో సరైన వైద్య విధానాలను రూపొందించడానికి, స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించడానికి ప్రభుత్వానికి వీలవుతుందని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తు వెల్లడించారు.
Also read: ప్రభుత్వ కళాశాలకు మహర్దశ.. విద్యారంగంలో కీలక ముందడుగు