తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) నివాసం వద్ద శనివారం కోలాహలం నెలకొంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన హైదరాబాద్లోని తన నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ నగరానికి వచ్చారనే వార్త తెలియగానే.. ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు, వివిధ సంఘాల నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో ఆయనను చూసేందుకు తరలివచ్చారు.
చాలా కాలం తర్వాత కేసీఆర్ ప్రజల మధ్యకు రావడంతో నంది నగర్ ప్రాంతమంతా పార్టీ కార్యకర్తల నినాదాలతో మారుమోగిపోయింది. తమ అభిమాన నాయకుడిని చూడడానికి, ఆయనతో ఫోటోలు దిగడానికి అభిమానులు పోటీ పడ్డారు. కార్యకర్తల ఉత్సాహాన్ని గమనించిన కేసీఆర్, ఓపికగా వేలాది మందితో ఫోటోలు దిగారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపేలా ఆయన చిరునవ్వుతో అందరినీ పలకరించడం గమనార్హం.
ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పటికీ.. కేసీఆర్ వెంటనే వెనుతిరగడంతో కార్యకర్తలు కొంత నిరాశకు లోనయ్యారు. అయితే, ఇప్పుడు ఆయన హైదరాబాద్లోనే మకాం వేయడం, పార్టీ బలోపేతంపై దృష్టి సారించడంతో గులాబీ శ్రేణుల్లో మళ్ళీ పాత జోష్ కనిపిస్తోంది. వచ్చే రెండో తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ పూర్తిస్థాయిలో హాజరవుతారని.. సభలో తమ గళాన్ని బలంగా వినిపిస్తారని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించేందుకు ‘గులాబీ బాస్’ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందని, రాబోయే రోజుల్లో పార్టీకి పూర్వవైభవం రావడం ఖాయమని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘తెలంగాణ ప్రజల గొంతుకగా కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీలో గర్జిస్తారు’ అని అక్కడికి వచ్చిన కార్యకర్తలు స్పష్టం చేశారు. కేసీఆర్ రాకతో నంది నగర్ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయేంతగా జనం తరలిరావడం చూస్తుంటే.. ఆయన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.
ALSO READ: CM Revanth: ఇక చెరువులను కాపాడే బాధ్యత జోనల్ కమిషనర్లదే: సీఎం రేవంత్