KCR SIT Investigation: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ (SIT) విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రేపు ఉదయం ఆయన ఎర్రవల్లి నివాసం నుండి బయలుదేరి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ పర్యటనను కేవలం విచారణగా కాకుండా.. పార్టీ శ్రేణుల ఐక్యతను చాటే భారీ బలప్రదర్శనగా మార్చాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
రేపు ఉదయం 9:00 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి భారీ కాన్వాయ్తో కేసీఆర్ బయలుదేరుతారు. రాజీవ్ రహదారి మీదుగా సాగే ఈ ప్రయాణంలో దారిపొడవునా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి ఆయనకు సంఘీభావం తెలపాలని పార్టీ పిలుపునిచ్చింది. ఉదయం 11:00 గంటలకు ఆయన బంజారాహిల్స్లోని నందినగర్ నివాసానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు సిట్ విచారణ ఎదుర్కోనున్నారు.
కేసీఆర్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ , చుట్టుపక్కల జిల్లాల నుండి భారీగా జన సమీకరణ జరుగుతోంది. విచారణ సమయంలో కేటీఆర్ నందినగర్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తారు.హరీష్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నేతలు తెలంగాణ భవన్లో ఉంటారు. ఇక్కడ సుమారు 2500 మందికి భోజన వసతులు ఏర్పాటు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా నల్ల జండాలతో నిరసనలు తెలపాలని, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఎర్రవల్లిలో జరిగిన కీలక సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్, హరీష్ రావు, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు. మాజీ ఎంపీ సంతోష్ రావు మాత్రం కేసీఆర్ వెంటే ఫామ్ హౌస్లో ఉన్నారు. రేపటి ఈ సంఘటనలతో హైదరాబాద్లోని ముఖ్య ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
Also Read: నోరు అదుపులో పెట్టుకో.. అంబటి రాంబాబుకు హోం మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్!