Operation Smile: స్వేచ్ఛ బ్యూరో: జోగుళాంబ గద్వాల్ జిల్లాలో బాల కార్మికత్వం నిర్మూలనే లక్ష్యంగా జనవరి 1వ తేది నుంచి 31వ తేది వరకు నిర్వహించిన 12వ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రత్యేక ఆపరేషన్లో మొత్తం 58 మంది బాలబాలికలను రిస్క్యూ చేసి సంరక్షణలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రిస్క్యూ చేయబడిన వారిలో 9 మంది బాలికలు, 49 మంది బాలురు ఉన్నారని తెలిపారు. వీరిలో 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై 11 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలను పనిలో పెట్టుకున్నందుకు 38 మంది యజమానులపై జిల్లా లేబర్ ఆఫీసర్ ద్వారా ఐఆర్ నమోదు చేసి, చట్టప్రకారం జరిమానాలు విధించడం జరిగిందని వివరించారు.
కొంతమంది పిల్లలు సొంత కుటుంబ పనులు లేదా సొంత దుకాణాల్లో పనిచేస్తున్నట్లు గుర్తించడంతో, వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)కి అప్పగించగా, సిడబ్ల్యుసి సభ్యులు పిల్లల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, పిల్లలను చదువుల వైపు మళ్లించేందుకు సూచనలు చేసి పంపించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్ స్మైలలో టీం–ఏ తరపున ఎస్ఐ కేశవరావు, ముగ్గురు పీసీలు, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మహేష్ కుమార్ (ఏసీఎల్), డీసీపీయు నుంచి రవి (పీఓఎన్ఐసీ), పద్మ (ఎస్డబ్ల్యూ), ప్రకాష్ (ఓఆర్డబ్ల్యూ), చైల్డ్ హెల్ప్లైన్ 1098 నుంచి శివలీల (కోఆర్డినేటర్), ఆర్డీఎస్ (ఎన్జీవో) నుంచి చంద్రశేఖర్ (కోఆర్డినేటర్)లు పాల్గొనడం జరిగిందన్నారు.
టీం–బి తరపున ఎస్ఐ మురళి, ముగ్గురు పీసీలు, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వేణుగోపాల్ (ఏఎల్ఓ), డీసీపీయు నుంచి శివయ్య (ఎల్సీపీఓ), సురేష్ (కౌన్సిలర్), లక్ష్మీదేవి (ఓఆర్డబ్ల్యూ–ఎఫ్), చైల్డ్ హెల్ప్లైన్ 1098 నుంచి జయన్న (కౌన్సిలర్), ఆర్డీఎస్ (ఎన్జీవో) నుంచి మద్దిలేటి (సీఎస్ఎం)లు విస్తృతంగా తనిఖీలు చేపట్టారన్నారు. బాల కార్మికత్వం సమాజానికి ముప్పుగా మారుతుందని, పిల్లల భవిష్యత్తును రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ తరహా అక్రమాలపై ఇకపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు సహకరించాలని కోరారు.
Also Read: Municipal Elections: మిర్యాలగూడ కాంగ్రెస్లో రగులుతున్న రాజకీయం.. పుర పోరులో ఓ ఎమ్మెల్యే కుటుంబం..?