Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ‘జాగృతి జనం బాట’ పర్యటనలో భాగంగా ఖమ్మంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ (BRS) పార్టీ నాయకత్వంపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, అలాగే తనపై జరిగిన కుట్రపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీనియర్లను దూరం చేసుకోవడమే తప్పు..
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను దూరం చేసుకోవడం పెద్ద తప్పిదమని కవిత స్పష్టం చేశారు. ‘సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ఎస్ వదులుకోవడమే అతి పెద్ద పొరపాటు’ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ లాంటి రాజకీయ అనుభవజ్ఞులే ఇటువంటి తప్పులు చేయడం ఆశ్చర్యకరమని, అనుభవజ్ఞులైన నేతలను వదులుకోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నుంచి చాలా మంది వెళ్లిపోతున్నారనే భావన నెలకొందని ఆమె అన్నారు. తుమ్మల లాంటి నేతనే కాపాడుకోలేని పార్టీ, ఇతరుల పరిస్థితి ఏంటని బీఆర్ఎస్లో ఉన్నవారు ఆలోచిస్తున్నారని కవిత పేర్కొన్నారు.
పార్టీతో నాకు సంబంధం లేదు: కవిత
ప్రస్తుతం తనకు బీఆర్ఎస్తో ఎలాంటి సంబంధం లేదని కవిత వెల్లడించారు. “20 ఏళ్లు ఆ పార్టీ కోసం పనిచేశా. కానీ కొందరు కుట్ర చేసి నన్ను పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారు” అని ఆరోపించారు. తనపై కుట్ర చేసిన వారి గురించి కచ్చితంగా మాట్లాడతానని, తనపై మరింత నీచ స్థాయిలో దాడులు జరిగినా బెదిరేది లేదని ధైర్యాన్ని ప్రదర్శించారు. ఆరు నెలలు జైల్లో ఉన్నా భయపడలేదని, వేరే వారైతే డిప్రెషన్తో ఇంటికే పరిమితమయ్యేవారని అన్నారు.
జూబ్లీహిల్స్ గెలుపుకు ప్రతిపక్షాలే కారణం
కాంగ్రెస్ పార్టీ పేరు ఎత్తితేనే ప్రజలు విమర్శిస్తున్నారని.. అయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడం ప్రతిపక్షాల వైఫల్యమేనని కవిత విమర్శించారు. ‘ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలతోనే కాంగ్రెస్ గెలిచింది. ప్రజల తరపున పోరాటం చేయాల్సినంత ప్రతిపక్షాలు చేయడం లేదు’ అని కవిత అభిప్రాయపడ్డారు. బీహార్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ తెలంగాణలో ఎలా గెలిచిందో ఆలోచించాలని అన్నారు.
పార్టీ పెట్టాలంటే డంకా బజాయించి ప్రకటిస్తా..
తాను కొత్తగా పార్టీ పెట్టాలనుకుంటే.. ప్రజలకు వజ్రాయుధం అయ్యే విధంగా పార్టీని స్థాపిస్తానని కవిత ప్రకటించారు. పార్టీ పెట్టేది ఉంటే మాత్రం హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి ఢంకా బజాయించి ప్రకటిస్తానని స్పష్టం చేశారు. జాగృతి సంస్థ గత 20 ఏళ్లుగా రాజకీయ అంశాలపై మాట్లాడుతోందని.. పార్టీ లేకుండా కూడా రాజకీయ అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని కవిత తెలిపారు.
బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు
బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. ప్రస్తుత అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లు జాగృతి ‘జనం బాట’ కార్యక్రమం ద్వారా నిద్ర లేస్తున్నాయని కవిత అన్నారు. నాతో పాటు ఉన్న వారంతా ఒక్క పైసా ప్రయోజనం పొందని వారేనని, తన ద్వారా ప్రయోజనం పొంది ఎమ్మెల్యే స్థాయి వరకు వచ్చిన వారు కూడా తనతో పాటు రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవపై అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. రేపే రైతుల ఖాతాల్లోకి డబ్బులు