KCR vs Kavitha: బీఆర్ఎస్ పార్టీలో వారసుల మధ్య సంక్షోభం కంటిన్యూ అవుతుందా? ఈ విషయంలో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయా? ఏదో విధంగా కేటీఆర్ను తండ్రి కేసీఆర్ కన్వీన్స్ చేశారా? కవిత ఎందుకు దిగిరావడం లేదు? సోమవారం దూతల ద్వారా జరిగిన చర్చలు ఎంతవరకు వచ్చాయి? వాటిని తేల్చాల్సిందేనని కవత ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
రాజకీయాల్లో నాన్చుడి ధోరణి మంచిదే.. మరీ డిలే అయితే ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం బీఆర్ఎస్లో అదే జరుగుతోంది. కేటీఆర్-కవితల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. వీరిద్దరినీ కన్వీన్స్ చేస్తున్నారు కేసీఆర్. ఈ క్రమంలో తొలుత కేటీఆర్తో దాదాపు మూడుగంటలపాటు చర్చించారు. కొడుక్కి చెప్పాల్సిన విషయాలు చెప్పారు.
ఇప్పుడు కూతురు కవిత వంతైంది. రేపో మాపో ఆమె పార్టీ పెట్టబోతోందని వార్తల నేపథ్యంలో బీఆర్ఎస్ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పెడితే మొదటికే ముప్పు వస్తుందని భావించారు పెద్దాయన కేసీఆర్. ఈ క్రమంలో సోమవారం కవిత వద్దకు ఇద్దరు వ్యక్తులను పంపించారట కేసీఆర్.
తొలుత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు సోమవారం మధ్యాహ్నం కవిత ఇంటికి వెళ్లారట. కవితతో దాదాపు గంటన్నరకు పైగానే చర్చలు సాగాయి. కాకపోతే ఆమె ఏమాత్రం మెట్టు దిగలేదని జాగృతి వర్గాల మాట.
ALSO READ: కేటీఆర్కు ఏసీబీ నోటీసులు, కవిత స్పందన
బీఆర్ఎస్ పార్టీ లీగల్ వ్యవహారాలను చక్కబెట్టే ఓ వ్యక్తి నాలుగు గంటల సమయంలో కవిత ఇంటికి వచ్చారట. కాకపోతే కొన్ని విషయాల్లో ఆమె మెట్టుదిగలేదని తెలుస్తోంది. వాటిని తేల్చిన తర్వాత మిగతా అంశాలపై చర్చిద్దామని కవిత అన్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం సాగుతోంది.
ప్రస్తుత పరిణామాలు గమనిస్తున్న ఆ పార్టీ నేతలు, కేసీఆర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఐదుగంటల వ్యవధిలో ఇద్దరు దూతలు వెళ్లడంతో వారి మధ్య పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని చెప్పారట ఆ దూతలు.
ఎవరికివారు ఉంటే ఎదురయ్యే సమస్యలపై కేసీఆర్ చేసిన సూచనలను ఆమెకి వివరించినట్లు పార్టీ వర్గాల మాట. కవిత మరీ బెట్టు దిగకపోవడంతో నేరుగా కేసీఆర్తో ఫోన్లో మాట్లాడించినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో పదవులు, హోదాల విషయంలో ఏ మాత్రం తొందర పడవద్దని పెద్దాయన సూచించినట్లు తెలిపాయి.
రెండు, మూడు అంశాల్లో కవిత పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేతలు మీడియా ముందు చెప్పే మాటలను ఆ దూతలు ప్రస్తావించారట. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తన పరిస్థితి ఏంటని ప్రశ్నించారట. తనకు ఇచ్చే హోదా విషయంలో ముందే క్లారిటీ ఇవ్వాల్సిదేనని ఆమె పట్టుబట్టారట. ఈ లెక్కన తొలి విడత చర్చలు దాదాపుగా ఫెయిల్ అయినట్టే.
మరో విడత చర్చలు ఈ వారంలో జరగవచ్చని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలు జరుగుతున్న వేళ సోమవారం సాయంత్రం కవిత.. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో రియాక్ట్ అయ్యారు.