Car stuck in flood waters: ఖమ్మం జిల్లాలో భారీ వరద నీటి కారణంగా పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఏన్కూరు మండలం నాచారం సమీపంలో ఆలయ దర్శనం ముగించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం తిరిగి వస్తుండగా కారు వరదలో చిక్కుకుపోయింది. ప్రయాణ సమయంలో మార్గమధ్యంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పక్కన వేసిన తాత్కాలిక మట్టి రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే వరద కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో.. వారు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా నీటిలో చిక్కుకుపోయింది. కొద్ది సేపటికే వరద ఉధృతి ఒక్క సారిగా పెరిగిపోవడంతో కారు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు:
కారు నీటిలో మునిగిపోతుండటంతో ఆందోళనకు గురైన ఒక మహిళ కారు నుంచి బయటకు వచ్చి ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆ మహిళ నీటిలో కొట్టుకుపోసాగింది. ఇది గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మహిళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
సురక్షితంగా బయటకు తీసిన కారు:
మహిళను రక్షించిన అనంతరం స్థానికులు.. ట్రాక్టర్ల సహాయంతో వరద నీటిలో పూర్తిగా చిక్కుకుపోయిన కారును కూడా సురక్షితంగా బయటకు వెలికితీశారు. సకాలంలో స్థానికులు స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనలో స్వల్ప గాయాలైన మహిళను కుటుంబ సభ్యులు తక్షణమే ఏన్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. వరద సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్మాణంలో ఉన్న తాత్కాలిక మార్గాల్లో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు సూచిస్తున్నారు.