లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తెలంగాణ బీజేపీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూనే.. గత చరిత్రను ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పరిణామాలను ప్రస్తావించిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఎండగట్టారు. తెలంగాణ ప్రజలు తమ హక్కుల కోసం కాంగ్రెస్ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని ఆయన అభివర్ణించారు.
1969 నాటి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పాలనలో జరిగిన అణచివేతను ఆయన వివరించారు. ఆ సమయంలో జై తెలంగాణ అన్న పాపానికి విద్యార్థులను తుపాకులతో కాల్చి చంపిన ఘనత కాంగ్రెస్దేనని విమర్శించారు. సుమారు 369 మంది పోరాట యోధులను కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టనబెట్టుకుందని మండిపడ్డారు. మలి దశ ఉద్యమంలో సైతం 1200 మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకోవాల్సి వచ్చిందని.. ఆ వేదనల నుండే రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి విమర్శలతో సభలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
రాష్ట్ర అభివృద్ధి విషయంలో తెలంగాణ వెనుకబడి ఉందన్న అంశాన్ని ఆయన గణాంకాలతో వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏడు ఎయిర్పోర్టులు అందుబాటులో ఉన్నాయని.. కానీ తెలంగాణలో కేవలం ఒకే ఒక్క విమానాశ్రయం ఉండటం శోచనీయమన్నారు. ఈ దుస్థితికి గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే కారణమని ధ్వజమెత్తారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందాల్సింది పోయి.. సమన్వయ లోపంతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు తమ రాజధాని ఏదో చెప్పుకోలేని అయోమయంలో ఉండటం బాధాకరమని వ్యాఖ్యానించారు.
ఇకపై అయినా రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి అభివృద్ధి పథంలో పయనించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. అమరావతిని రాజధానిగా గుర్తించే చట్టబద్ధత బిల్లుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ఎంపీలు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. సభలోనే నిరసనలు తెలుపుతూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చరిత్రను వక్రీకరిస్తూ నిందలు వేయడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు కిషన్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. సోనియా గాంధీ దృఢ సంకల్పం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని వారు గుర్తు చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అమరవీరుల త్యాగాలను కించపరచవద్దని హితవు పలికారు. కిషన్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రం ఇచ్చిన పార్టీపై బురద చల్లడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
ALSO READ: Jagan on Ap Capital: ఏపీ రాజధాని అమరావతిపై జగన్ హాట్ కామెంట్స్.. డ్రామా లెందుకంటూ ప్రశ్న