Warangal Fort: చారిత్రక వరంగల్ కోట పరిరక్షణపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాశారు. కోట భూములను ఆక్రమణల నుంచి కాపాడాలని, వాటిని వెంటనే భారత పురావస్తు శాఖ (ASI) ఆస్తులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో వరంగల్ కోట భూములను సాధారణ ‘ప్రభుత్వ భూమి’గా చూపిస్తున్నారని, ఇదే ఆక్రమణలకు ప్రధాన కారణమవుతోందని కిషన్రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ సాంకేతిక కారణం వల్లే కోట పరిసరాల్లో ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన దృష్టికి తెచ్చారు.
వరంగల్ కోట చుట్టూ ఉన్న చారిత్రక మట్టి గోడను (Mud Wall) కొందరు ఆక్రమించి, కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని కిషన్రెడ్డి తెలిపారు. ఆక్రమణల విషయంలో ASI అధికారులు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ, స్థానిక జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. ఇలాగే కొనసాగితే వరంగల్ కోట వారసత్వ సంపదకు, దాని ఉనికికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆక్రమణల చెరలో ఉన్న కోట భూములను వెంటనే స్వాధీనం చేసుకుని, వాటిని తిరిగి ASIకి అప్పగించాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మన ఘన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు.
Read Also: మాకు మున్సిపల్ ఎన్నికలు వద్దు.. పంచాయతీ ఎన్నికలే ముద్దు..