Vande Bharat Travelling Without Ticket: ఇండియన్ రైల్వే ప్రయాణాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లిన రైలు వందేభారత్ ఎక్స్ ప్రెస్. సంప్రదాయ పద్దతిలో కొనసాగే రైలు ప్రయాణానికి వందేభారత్ రైలు కొత్త వేగాన్ని తీసుకొచ్చింది. సెమీ హైస్పీడ్ రైలుగా భారతీయ రైల్వేలోకి అడుగు పెట్టి, ప్రయాణీకులకు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ అనుభవాన్ని అందించింది. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. అయితే, వందేభారత్ రైల్లో ప్రయాణించాలంటే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే, పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
వందేభారత్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం అని తెలిసినా చాలా మంది టికెట్ లేకుండా జర్నీ చేస్తున్నట్లు తేలింది. తాజాగా జమ్మూలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వందే భారత్లో పదుల సంఖ్యలో టికెట్ లేని ప్రయాణీకులు ఉండటంతో షాకయ్యారు. ఈ తనిఖీల్లో ఏకంగా 31 మంది టికెట్ లేని ప్రయాణీకులు పట్టుబడ్డారు. ఇవాళ జమ్మూ డివిజన్ లో రైల్వే సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు కోచ్ లలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని అధికారులు పట్టుకున్నారు. వారికి పెద్ద మొత్తంలో జరిమానా విధించారు.
ఈ తనిఖీల గురించి జమ్మూ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉచిత్ సింఘాల్ కీలక విషయాలు వెల్లడించారు. టికెట్ లేకుండా వందేభారత్ రైల్లో ప్రయాణించడం పెద్ద నేరం అని చెప్పారు. వందే భారత్ రైలు నంబర్ 22478లో జమ్మూ- లూథియానా మధ్య ప్రయాణిస్తున్న సుమారు 31 మంది దగ్గర టికెట్ లేదని చెప్పారు. వారికి ఏకంగా రూ. 80,000 జరిమానా విధించినట్లు వెల్లడించారు.
Read Also: లోకో మోటివ్ మీద ఏఐ కెమెరాలు, వన్యప్రాణులు చనిపోకుండా రైల్వే కీలక నిర్ణయం!
“సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో టికెట్ లేని ప్రయాణానికి జరిమానా ఎక్కువగా ఉంటుంది. అందుకే, టికెట్ లేని 31 మంది ప్రయాణీకులకు సుమారు రూ. 80 వేల జరిమానా విధించాం. వందేభారత్ ఎక్కే ప్రతి ప్యాసింజర్ దగ్గర కచ్చితంగా టికెట్ ఉండాల్సిందే. అలా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. అనవసరంగా టికెట లేకుండా వందేభారత్ ప్రయాణం చేస్తూ పట్టుబడి, ఇబ్బందులు ఎదుర్కోకూడదని హెచ్చరిస్తున్నాం” అని చెప్పుకొచ్చారు.
Read Also: వందే భారత్ స్లీపర్ రైళ్లలో నోరూరించే వంటకాలు.. వడ్డించే రుచులు ఇవే!