Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ మరోసారి దేశ వ్యతిరేకతను బయటపెట్టుకుంందని భారతదేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వంటి సంస్థలను టార్గెట్ చేయడం కాంగ్రెస్ దుర్మార్గానికి పరాకాష్ట అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. విదేశీ సంస్థలతో అంటకాగుతూ దేశ వ్యతిరేక వైఖరిని కాంగ్రెస్ మరోసారి చాటుకుందని ధ్వజమెత్తారు. అమెరికా కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్(యూఎస్సీఐఆర్ఎఫ్) అనే సంస్థ ఇచ్చిన నివేదికను కేంద్ర మంత్రి ఖండించారు. భారత్ పై పక్షపాతంగా, ప్రేరేపిత వైఖరితో ఈ నివేదికను అమెరికాకు చెందిన సంస్థ విడుదల చేసిందన్నారు. యూఎస్సీఐఆర్ఎఫ్ చాలా ఏళ్లుగా భారత్పై ద్వేషభావంతో అసంబద్ధమైన కథనాలపై ఆధారపడి ఏకపక్షంగా, భావజాలపరంగా నివేదికలు ఇస్తూ భారత్ గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ తప్పుపట్టిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.
ఇలాంటి నివేదికలు ఇవ్వడం ద్వారా కమిషన్ పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిందన్నారు. భారత్పై ఏకపక్షంగా అబద్ధపు విమర్శలు చేయడం పక్కన పెట్టి, అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, భారత్ లక్ష్యంగా కొన్ని సంస్థలు దుష్ప్రచారం చేయడం, అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులకు బెదిరింపులు, భారతీయులపై పెరుగుతున్న వివక్షను ఏమాత్రం పట్టించుకోని ఇలాంటి కొన్ని విదేశీ సంస్థలు ఒక పథకంగా భారతదేశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కిషన్ రెడ్డి వివరించారు. అమెరికాలో భారతీయుల పరిస్థితి దారుణంగా ఉంటే.. కాంగ్రెస్ వైఖరి మరింత చాలా దారుణంగా తయారైందని ఫైరయ్యారు. గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దేశ వ్యతిరే శక్తులకు కేంద్రంగా మారిందన్నారు. దేశంలో ఏదైనా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి విపత్తు సంభవించినప్పుడు కూడా కాంగ్రెస్ పైశాచిక ఆనందం వ్యక్తం చేస్తోందని ఎద్దేవాచేశారు.
Also Read: Romantic Drama OTT: 24 ఏళ్ల యువకుడితో 40 ఏళ్ల ఆంటీ ప్రేమ… కూతురు ఉన్నా కోరిక తీరక…
పశ్చిమాసియాలో జరుగుతున్న గందరగోళ పరిస్థితుల్లో కూడా ఎల్పీజీ విషయంలో తప్పుడు పుకార్లు వ్యాప్తి చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేసిందన్నారు. రా వంటి సంస్థ భారత్ను ఉగ్రవాదం వంటి ముప్పు నుంచి కాపాడేందుకు ఎల్లప్పుడూ దేశ రక్షణ కోసం పనిచేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ సామాజిక-సాంస్కృతిక సంస్థగా దేశ ఐక్యత, దేశ సమగ్రత కోసం పనిచేస్తుంటుందని కేంద్ర మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో, ఇలాంటి సంస్థలను బలహీనపరచాలని కాంగ్రెస్ కోరడంలో ఆంతర్యమేంటో వారికే తెలియాలని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక వైఖరిని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.
Also Read: Kukatpally Robbery: కళ్ళల్లో కారం కొట్టి ‘కోటి’ దోపిడీ చేసిన గ్యాంగ్ అరెస్ట్..!