తెలంగాణ జనసమితి (TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, రాబోయే మున్సిపల్ ఎన్నికలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై సూటిగా స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై కోదండరాం స్పష్టత ఇచ్చారు. పొత్తుపై తాము ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని.. తమ పార్టీ అభిప్రాయాలను ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి వివరించామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని గమనిస్తున్నామని, ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత వేగంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ జీవనాడి అయిన సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డపై ఉందని కోదండరాం పిలుపునిచ్చారు. సింగరేణిని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని, అది రాష్ట్ర సంపద అని ఆయన నొక్కి చెప్పారు.
ఇదే సందర్భంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఆయన స్పందిస్తూ.. ‘నేను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే’ అని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు లేని భయం, ఇప్పుడు విచారణ జరుగుతుంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు మొదలైందని ఆయన ఎద్దేవా చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.
గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందని కోదండరాం విమర్శించారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే, కేసీఆర్ కుటుంబం తప్ప మరెవరూ బాగుపడలేదని ఆరోపించారు. రాష్ట్ర వనరులను దుర్వినియోగం చేశారని, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తెలంగాణ జనసమితి కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ALSO READ: CP Sajjanar: వీడియోలు తీయడం కాదు.. ప్రాణాలు కాపాడటం ముఖ్యం, రియల్ హీరోలను సత్కరించిన సీపీ సజ్జనార్