Kokapet Lands: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే కోకాపేట ఫేజ్-2 లే అవుట్ భూముల వేలం సంచలనం సృష్టించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్లాట్లకు జరిగిన వేలంలో ఊహించని ధరలు పలకడంతో.. హైదరాబాద్ రియల్టీకి ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది. కోకాపేట భూముల వేలం మరోసారి భారీ ధర పలికింది. ఈ రోజు జరిగిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.131 కోట్లు ధర సాధించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇది మరో మైలురాయి. ప్లాట్ నెంబర్ 19 లోని 4 ఎకరాల భూమి వేలానికి వచ్చింది. ఈ నాలుగు ఎకరాల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.524 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. గతంలో జరిగిన వేలంపాటలో వచ్చిన ధరల కంటే ఇది కొంచెం తక్కువ.
ఈ వేలం పాటల పట్ల రియల్ ఎస్టేట్ వర్గాలు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నాయి. హై-రైజ్ భవనాల నిర్మాణం, వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు కోకాపేట భూములు అనుకూలం. అందుకే స్థిరాస్తి వ్యాపారులు ఈ ప్లాట్ల కొనుగోలుకు పోటీ పడ్డారు. ప్రస్తుతం ప్లాట్ నెంబర్ 20 వేలం కొనసాగుతోంది. ఈ వేలంపాటలో కూడా భారీ ధరలు నమోదయ్యే అవకాశం ఉంది. కోకాపేట భూముల ధరలు స్థిరాస్తి రంగం పటిష్టతను సూచిస్తున్నాయి. ఈ ప్రాంతం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. నగర అభివృద్ధికి ఈ భూముల అమ్మకం గణనీయంగా దోహదపడుతుంది.
ప్లాట్ నెం. 20 ఎకరం ధర ఏకంగా రూ.118 కోట్లు పలికింది. ఈ వేలంలో మొత్తం ఎనిమిది ప్లాట్లు ఉండగా, ప్రతి ప్లాటు ధర కూడా రూ.100 కోట్లకు పైగానే పలకడం విశేషం. అతి తక్కువ ధర పలికిన ప్లాట్ నెం. 10 ధర కూడా ఎకరానికి రూ. 100.75 కోట్లుగా నమోదైంది. అత్యధిక ధర పలికిన ప్లాట్ నెం. 20ని ప్రిజం ఎడ్యుటెక్ కంపెనీ దక్కించుకుంది. ఈ వేలం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏకంగా రూ.3,319 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
ఇంత భారీ ధరకు భూములు అమ్ముడవడంతో, కొనుగోలుదారులు కోకాపేట ప్రాంతాన్ని భవిష్యత్తులో ప్రధాన వాణిజ్య, నివాస కేంద్రంగా భావిస్తున్నారని అర్థమవుతోంది. ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వేలం ఫలితం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూర్చే విధంగా ఉంది.