Rock Blast Kokapet : నిబంధనల్ని పాటించకుండా, కనీస జాగ్రత్తలు అనుసరించకుండా.. నియోపోలీస్ దగ్గర చేపట్టిన బ్లాస్టింగ్ పరిసర ప్రాంతాల్లో అల్లకల్లోలం సృష్టించింది. దూరం నుంచి చూసిన వాళ్లంతా.. సినిమా షూటింగ్ జరుగుతుంది అనుకుని చూస్తుంటే.. పరిసరాల్లోని ప్రజలు మాత్రం ప్రాణాల్ని చేతిలో పెట్టుకుని.. బిక్కుబిక్కుమంటూ తల దాచుకున్నారు. వరుసగా పేల్చిన పది పేళుల్లుతో గాల్లోకి లేచిన రాళ్లు.. సమీపంలో విధ్వంసం సృష్టించాయి. ఈ ఘటనపై నార్సింగ్ పోలీసులు కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
కోకాపేటలోని నియోపోలీస్ దగ్గర భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించిన ఈ భూముల్లో భారీ నిర్మాణ సంస్థలు.. బహుల అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి బండరాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. బాస్టింగ్ చేసేందుకు ప్రభుత్వం అనేక నిబంధనల్ని రూపొందించింది. వాటిని తూచా తప్పకుండా అనుసరించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. రాళ్లను బ్లాస్టింగ్ చేసినప్పుడు.. భారీ స్థాయిలో రాళ్లు చెల్లాచెదురుగా పడుతుంటాయి. కొన్నిసార్లు.. చాలా దూరం వరకు వెళ్లే అవకాశం ఉంది. అందుకే.. చాలా జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. ఈ విషయాన్ని విస్మరించిన నియోపోలీస్ లోని కొన్ని నిర్మాణ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
ఇక్కడి నిర్మాణాల కోసం బండరాళ్లలో డిటోనేటర్లు పెట్టి బ్లాస్టింగ్ చేసింది… ఓ నిర్మాణ సంస్థ. దీంతో.. బండరాళ్లు చిన్నచిన్న ముక్కలుగా పేలిపోతూ గాల్లోకి లేచాయి. సినిమాల్లో చూపించేలా.. వందలాది రాళ్లు గాల్లోకి లేవడంతో.. ఆ శబ్దం, రాళ్లను చూపిన స్థానిక జనం పరుగులు తీశారు. రాళ్ల నుంచి తప్పించుకునేందుకు నానా ప్రయత్నాలు చేశారు. అయినా.. చాలా మందికి గాయాలైనట్లు స్థానికులు చెబుతున్నారు.
సాధారణంగా జనాలు ఎక్కువగా తిరిగే సమయంలో బ్లాస్టింగ్ చేయకూడదు. కానీ.. నిబంధనల్ని అనుసరించని నిర్మాణ సంస్థ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పది చోట్ల డిటోనేటర్ల బ్లాస్టింగ్ నిర్వహించింది. దీంతో.. భారీ స్థాయిలో రాళ్లు పరిసరాల్లోని ఇళ్లు, వానహాలపై వర్షంలా కురిశాయి. ఈ దృశ్యాలను దూరం నుంచి చూస్తున్న జనం మాత్రం.. అక్కడ ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది అనుకుని భ్రమపడ్డారు. ఆ తీరుగా పేళ్లుళ్లు సంభవించాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాల్లోకి లేచిన రాళ్లు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో.. సమీపంలోని అయ్యప్ప స్వాముల శిబిరంతో పాటు కార్మికులు ఉండేందుకు నిర్మించిన తాత్కాలిక నివాసాలపై రాళ్లు పడ్డాయి. పేలుళ్ల దాటికి చిన్నచిన్న రాళ్లతో పాటు పెద్ద బండరాళ్లు సైతం గాల్లోకి లేచాయంటున్నారు. ఈ ఘటనతో సమీపంలోని పలువురికి గాయాలు కాగా, అక్కడ నిలిపి ఉంచిన వాహనాలు ధ్వంసం అయ్యాయి.
రాళ్ల వర్షం నుంచి బయటపడిన అయ్యప్ప స్వాములు, కార్మికులు ప్రాణాలతో బయటపడ్డామని ఊపిరి పీల్చుకున్నారు. ఇలా పేలుళ్లు నిర్వహిస్తారని ఊహించలేదని, కాస్త ఉంటే ప్రాణాలు కోల్పోయే వాళ్లమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనలో ఎగిరిపడ్డ రాళ్లు పడడంతో.. లేబర్ క్యాంప్, ఇతర నివాసాల్లోని వంట సామాగ్రి చెల్లాచెదురుగా పడిపోయింది.
ఈ ఘటనతో తీవ్ర భయభ్రాంతులకు గురైన స్థానికులు.. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిర్మాణ సంస్థపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి నిర్లక్ష్యపూరిత వైఖరిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. దీంతో.. ఘటనను పరిశీలించిన స్థానిక నార్శింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్స్ ప్లోజివ్ చట్టంతో పాటు, BNS 125, 91B ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.