Komatireddy Raj Gopal Reddy: స్వేచ్చ బ్యూరో: మునుగోడు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని, ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ముందుకు సాగుతున్నామని నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. చౌటుప్పల్ పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన చౌటుప్పల్ పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన కీలక ప్రసంగం చేశారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ, పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తలు ఒక తాటిపైకి వచ్చి, కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధించగలమని ఆయన పిలుపునిచ్చారు.
నాయకుడిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు
రాజకీయాల్లో ఓపిక, నిరంతర శ్రమ చాలా ముఖ్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. నిరుత్సాహపడకుండా ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతే, పదవులు వాటి అంతట అవే వెతుక్కుంటూ వస్తాయని హితవు పలికారు. ‘మనం ఎన్నుకునే నాయకుడు ఎలాంటి వాడు? వ్యక్తిగతంగా మంచివాడేనా? మనకు అందుబాటులో ఉంటాడా? లేదా?’ అని ప్రజలు అన్ని కోణాల్లో నిశితంగా గమనిస్తుంటారని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో మార్పు వస్తే, వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటుందని హెచ్చరించారు.
మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా
గత ఎన్నికల సరళిని గుర్తు చేస్తూ.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ (టీఆర్ఎస్) మెజార్టీ స్థానాల్లో విజయం సాధించినప్పటికీ, మునుగోడులో మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందని ఆయన కొనియాడారు. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి అగ్రనాయకత్వం వరకు అందరూ సమిష్టిగా కష్టపడటం వల్లే ఆనాడు మునుగోడులో చారిత్రాత్మక విజయం సాధ్యమైందన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారికి ఏ చిన్న ఆపద వచ్చినా కొండంత భరోసాగా నిలవాలని కార్యకర్తలకు సూచించారు.
నూతన అధ్యక్షుల ప్రమాణ స్వీకారం.. ఎమ్మెల్యేకు సన్మానం
ఈ వేడుకల్లో భాగంగా చౌటుప్పల్ మండల అధ్యక్షుడిగా బోయ దేవేందర్, పట్టణ అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు వారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.