DGP Anand: వరంగల్ నిట్ ప్రాంగణంలో పోలీసు అధికారులతో రాష్ట్ర డీజీపీ ఆనంద్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల పర్యటనలో భాగంగా వరంగల్ వచ్చిన ఆయన, పోలీసు వ్యవస్థ పనితీరుతో పాటు ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. తన ఐపీఎస్ శిక్షణ ఇక్కడే జరిగిందని గుర్తు చేసుకున్నారు. అప్పటి నక్సలైట్ల భయాలు, కూంబింగ్ ఆపరేషన్ల నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
నక్సలిజం అంతర్థానం
రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా సమసిపోయిందని డీజీపీ స్పష్టం చేశారు. కీలక నేతలు, క్యాడర్ లొంగిపోవడంతో ఇప్పుడు వారి రీహాబిలిటేషన్ పెద్ద సవాలుగా మారిందన్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం లొంగిపోయిన వారికి పూర్తి సహాయం అందిస్తామన్నారు. అలాగే నక్సల్స్ దాడుల్లో మరణించిన బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు ‘టీజీ వీర్’ అనే ప్రత్యేక అప్లికేషన్ను ప్రారంభించినట్లు వెల్లడించారు.
అతిపెద్ద సవాళ్లు.. డ్రగ్స్, సైబర్ నేరాలు
ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్, సైబర్ నేరాలే ప్రధాన సమస్యలుగా మారాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్ల చేతిలో బాధితులు ఏకంగా రూ.1,750 కోట్లు కోల్పోయారని, ముఖ్యంగా వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులే అధిక లాభాల ఆశతో మోసపోతున్నారని తెలిపారు. డ్రగ్స్ మహమ్మారి పట్టణాల నుంచి గ్రామాలకు, చివరకు పాఠశాలలకు కూడా వ్యాపించిందన్నారు. విద్యాసంస్థలు ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని, త్వరలోనే యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
సెక్యూరిటీ ఉపసంహరణపై స్పష్టత
గతంలో నక్సల్స్ ముప్పు కారణంగా ప్రజాప్రతినిధులకు భారీగా భద్రత ఇచ్చామని, ఇప్పుడు ఆ అవసరం లేకపోవడంతోనే సెక్యూరిటీని సమీక్షించి తగ్గిస్తున్నామని చెప్పారు. ప్రజాధనం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, నేరుగా తన సొంత భద్రతను కూడా తగ్గించుకున్నానని తెలిపారు. ఈ అంశాన్ని ఎవరూ రాజకీయం చేయవద్దని డీజీపీ కోరారు.
Also Read: కొత్త పింఛన్లపై రేవంత్ సర్కార్ కోతలు.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే పింఛన్లు బంద్!