Sambasiva Rao: స్వేచ్ఛ బ్యూరో: ‘హరీష్ రావు తో నాకు పంచాయతీ లేదు.. మీ యూనియన్ పంచాయతీ కోసం సింగరేణి సంస్థ ప్రతిష్ఠ దెబ్బ తీయొద్దు.. కార్మికులను అవమానించినట్టుగా మాట్లాడొద్దు.. ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు.. రుజువు చేయాలి’ అని ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు. సీపీఐ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 40లక్షల టన్నుల బొగ్గు మాయమైందని హరీష్ రావు అంటున్నారని, మాకు దీంతో ఏం సంబంధం లేకున్నా.. దాని వెనుక ఉద్దేశ్యం ఇంకేదో ఉందన్నారు. నన్ను స్కాం లు లేదా కాలరీస్ పక్షాన అని హరీష్ రావు అంటున్నారని కానీ అక్కడ జరిగింది. సింగరేణి తప్పుడు లెక్కలు చూపించడం వల్లేనన్నారు.
కార్మికుల పక్షాన ఉన్నది ఎవరు?
రుణాలు, లేదంటే రేటింగ్ ఇంకేదో దాని కోసం 40 లక్షల టన్నుల బొగ్గు లేనిది ఉన్నట్టు చూపించారన్నారు. కానీ దొంగతనం జరిగినట్టు హరీష్ రావు మాట్లాడుతున్నారని ఇదిసింగరేణి ప్రతిష్ట దెబ్బతీసేలా ఉండొద్దు కదా? అని ప్రశ్నించారు. కార్మికుల పక్షాన ఉన్నది ఎవరు?ఏ సమస్య ఉన్నా కొట్లాడి పోరాటం చేసేది మేము..సమ్మె నోటీసు ఇచ్చాం.. వందేళ్లుగా మేము కార్మికులతో ఉన్నామన్నారు.గత పదేళ్లు చేసిన తప్పులే.. ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. 2015 లో ఏ మైన్ కు అయినా వేలం విధానం కేంద్రం తెస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేసిందన్నారు. దీంతో సింగరేణి ఊపిరి తీసినట్టు అయ్యిందన్నారు. ఆ తర్వాత వేలంలో పాల్గొనద్దు అని వదిలేశారు.. అలా రెండు మైన్స్ పోయాయని ఆరోపించారు. సింగరేణి ఉన్నా.. కొన్ని మైన్స్ ను ప్రవేట్ సంస్థలకు ఇచ్చారన్నారు.
Also Read: ఉస్మానియా మెడికల్ కాలేజీలో విషాదం.. భవనంపై నుంచి పడి సైట్ ఇంజనీర్ మృతి!
హరీష్ రావుకు హితవు
సింగరేణి పేరుతో 26 వేల కోట్లు జెన్ కో వంటి సంస్థల పేరుతో అప్పు చేశారన్నారు. ఇది మీరు కార్మికులకు మేలు చేసినట్టా లేదంటే.. నష్టమా? అని నిలదీశారు. గతంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గా ఉన్న దాసోజు శ్రవణ్.. సెంట్రల్ విజిలెన్స్ కు లేఖ రాశారని, సత్యం రామలింగరాజు లాగే.. బీఆఱ్ఎస్ హయంలో సింగరేణిలో ఇలాగే 75లక్షల టన్నుల బొగ్గు లెక్కలు రాశారని లేఖలో పేర్కొన్నారన్నారు. ఒక్క బొగ్గు పెళ్ల కూడా దొంగతనం ఉండదన్నారు. లెక్కలు ఎక్కువ రాయడం తప్ప.. దొంగతనం లేదని, ఆధారాలు లేకుండా ఆరోపణలు సరైంది కాదని హరీష్ రావుకు హితవు పలికారు.
ఏ సీఎం రాష్ట్ర వాటా నీళ్లు వదులుకోరు
ఇప్పుడు స్కాం జరిగింది అంటే… బీఆర్ఎస్ హయంలో 75లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఎక్కువ చూపించారని, ఇది స్కాం అని ఆయన ఎందుకు అనట్లేదు అని ప్రశ్నించారు. ఇప్పుడు దొంగతనం జరిగిందంటే.. అప్పుడు కూడా దొంగతనం చేసినట్టే కదా? అని నిలదీశారు. దొంగ లెక్కలు రాశారు అని మేము అంటున్నామన్నారు. ఏ ముఖ్యమంత్రి తన రాష్ట్ర నీటి వాటాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరన్నారు. రాజకీయాల కోసం నేతలు మాట్లాడుతుంటారని మండిపడ్డారు. ఏ సీఎం అయినా వాళ్ల రాష్ట్ర వాటా నీళ్లు వదులుకోరని స్పష్టం చేశారు.