Supreme Court: స్వేచ్ఛ బ్యూరో: మిస్సింగ్ కేసులను ఈజీగా తీసుకోవద్దని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదు రాగానే కేసులు నమోదు చేసి అవసరమైన చట్టపర చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అదృశ్యమైన వ్యక్తి వయసు, లింగంతో సంబంధం లేకుండా విచారణ జరపాలని తేల్చి చెప్పింది. గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉపయోగించిన ‘పర్సన్’ అనే పదాన్ని కేవలం పిల్లలకు మాత్రమే వర్తించేలా కొన్ని రాష్ట్రాలు అర్థం చేసుకోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
పర్సన్ అంటే పిల్లలు మాత్రమే కాదు..
పర్సన్ అనే పదం పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని, పెద్దలకు వర్తించదని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఈ విషయం తెలిసి తాము ఆశ్చర్యపోయామని వ్యాఖ్యానించింది. ఇది ఉద్దేశపూర్వకంగా సృష్టించుకున్న భ్రమగా భావిస్తున్నామని తెలిపింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లోని అంశాలు స్పష్టంగానే ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ‘వ్యక్తి’ అనే పదం వయసు లేదా లింగంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ సూచిస్తుందని స్పష్టం చేసింది.
ఫిర్యాదు రాగానే కేసు నమోదు..
అందువల్ల పిల్లలు మాత్రమే కాకుండా ఏ వ్యక్తి అదృశ్యమైనా పోలీసులు తక్షణమే స్పందించాల్సి ఉంటుందని పేర్కొంది. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసులు నమోదు చేసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని చెప్పింది. ఎవరైనా కనిపించకుండా పోతే తొలి గంటలు అత్యంత కీలకమైనవని పేర్కొంది. ఆ సమయంలో పోలీసులు వేగంగా చర్యలు చేపడితే అదృశ్యమైన వ్యక్తిని గుర్తించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపింది.
నిర్లక్ష్యం వహిస్తే సీఎస్, డీజీపీలు కోర్టుకే..
అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభించి, అతడిని లేదా ఆమెను కాపాడిన తర్వాత వారిని ఎలాంటి ఆలస్యం లేకుండా కుటుంబ సభ్యులకు అప్పగించాలని పేర్కొంది. మిస్సింగ్ కేసులకు సంబంధించి గతంలో జారీ చేసిన ఆదేశాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా పాటించాలని ధర్మాసనం హెచ్చరించింది. ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాల్సి వస్తుందని పేర్కొంది.
Also Read: ఆస్పత్రి ఖర్చులకు భయపడక్కర్లేదు.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేంద్రం బంపర్ ఆఫర్!