KBR Park Traffic: స్వేచ్ఛ బ్యూరో: ‘హెచ్-సిటీ’ ప్రాజెక్ట్ కింద కొనసాగుతున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనుల దృష్ట్యా ఈనెల 18నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు హైదరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. పనుల కారణంగా అందుబాటులో ఉన్న రహదారి విస్తీర్ణం తగ్గిపోయిందన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న రోడ్ల మీదుగానే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండటం వల్ల అందుబాటులో ఉన్న రోడ్డుపై ఇరువైపులా రాకపోకలు కొనసాగితే తీవ్రమైన ట్రాఫిక్ జాంలు, ప్రయాణంలో జాప్యం, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి, ప్రయాణీకుల భద్రత కోసం కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు.
రెండు పైలట్ ట్రయల్స్..
ఈ వన్-వే విధానాన్ని అమలు చేయడానికి ముందు దీని సాధ్యాసాధ్యాలు, నిర్వహణ అవసరాలను అంచనా వేయడానికి రెండు పైలట్ ట్రయల్స్ను నిర్వహించినట్టు చెప్పారు. మొదటి ట్రయల్ ఏప్రిల్ 5న దాదాపు 3 గంటల పాటు నిర్వహించామన్నారు. రెండో ట్రయల్ ను జూన్ 21న దాదాపు 6 గంటల పాటు జరిపినట్టు చెప్పారు.
ఈనెల 18నుంచి వన్-వే ట్రాఫిక్ ..
ఈ రెండు ట్రయల్స్ లో ట్రాఫిక్ ప్రవాహం, జంక్షన్ల పనితీరు, లేన్ క్రమశిక్షణ, రద్దీ కేంద్రాలు, వాహనదారుల రాకపోకలను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. ఈ క్రమంలో ఎదురైన అనుభవాల ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసి ఈనెల 18నుంచి వన్-వే ట్రాఫిక్ విధానాన్ని అధికారికంగా అమలు చేయనున్నట్టు వివరించారు.
లేన్ మార్కింగ్లు , లేన్ ఛేంజర్ లు ఏర్పాటు
ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అవసరమైన ప్రదేశాలలో సరైన లేన్ మార్కింగ్లు , లేన్ ఛేంజర్ లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కీలకమైన కూడళ్లలో దిశానిర్దేశం బోర్డులు, ట్రాఫిక్ సైన్ బోర్డులను పెడుతున్నట్టు చెప్పారు. వాహనదారులకు మార్గనిర్దేశం, సహాయం అందించడానికి ముఖ్యమైన ప్రదేశాలలో 24 గంటలూ ట్రాఫిక్ పోలీసు సిబ్బంది నియమిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకునేందుకు గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ రూట్లలో అవసరమైన మార్పుల ప్రక్రియ చేపట్టామన్నారు. పరిస్థితులను ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, సీసీ కెమెరాల నెట్ వర్క్ ద్వారా నిరంతర పర్యవేక్షిస్తామన్నారు. ట్రాఫిక్ రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి అనువైన ప్రదేశాలలో డ్రోన్ల ద్వారా రియల్-టైమ్ పర్యవేక్షణ ఉంటుందన్నారు.
చేయాల్సినవి..
కొత్త వన్-వే ట్రాఫిక్ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని మీ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలన్నారు. లేన్ మార్కింగ్లు, సైన్ బోర్డులు, విధుల్లో ఉండే ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. అంబులెన్సులు, ఫైర్ ఇంజన్ల వంటి అత్యవసర వాహనాలు వెళ్ళడానికి లేన్-2 ద్వారా ఆటంకం లేని మార్గాన్ని కల్పించాలన్నారు. ఖచ్చితమైన ట్రాఫిక్ అప్ డేట్ల కోసం ట్రాఫిక్ పోలీస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, నావిగేషన్ యాప్ లను మాత్రమే చూడాలన్నారు. కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు పార్క్ చెయ్యాలని చెప్పారు.
చేయకూడనివి..
ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో, ఆఫ్-పీక్ సమయాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చెయ్యవద్దని తెలిపారు. అలా చేస్తే యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందన్నారు. వాహనాల రాకపోకలను అడ్డుకునేలా పార్కింగ్ చెయ్యొద్దన్నారు. అనధికారిక సోషల్ మీడియా గ్రూపులలో ప్రచారమయ్యే దృవీకరించని ట్రాఫిక్ సమాచారాన్ని నమ్మవద్దు.. ఫార్వర్డ్ చేయవద్దన్నారు. ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరారు.
Also Read: మిస్సింగ్ కేసుల్లో ఇకపై ఆటలు సాగవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!