KP Vivekananda Goud: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్కపని చెయ్యలేదని అసెంబ్లీ బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద గౌడ్ ఆరోపించారు. హంగు ఆర్భాటాలు తప్ప నగరానికి చేసింది ఏం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్ లో బుధవారం మీడియాతో మాట్లాడారు. స్వయంగా ముఖ్యమంత్రి రోడ్ల పైకి వస్తానని అంటున్నాడని, ప్రజలకు ఏం అవసరమో గుర్తించడంలో ముఖ్యమంత్రి రెండేళ్ల రెండు నెలల పాలనలో ఘోరంగా విఫలం అయ్యాడన్నారు. ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ఫెయిల్ అన్నారు. సెకండ్ ఫేస్ మెట్రో విస్తరణలో భాగంగా ఒక్క అడుగు ముందుకు పడడం లేదన్నారు.
కేసీఆర్ హయంలో ఆమోదించిన మెట్రో విస్తరణ ప్రాజెక్టును రద్దు చేసి నగర ప్రజలకు అన్యాయం చేశారన్నారు. నార్త్ హైదరాబాద్ కు మెట్రో డిమాండ్ ఉంది, దాని పై ఎటువంటి చర్చ ముఖ్యమంత్రి చేయడం లేదన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో హడావుడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏం మాట్లాడడం లేదన్నారు. హైదరాబాద్ పై అవగాహన ఉన్న మంత్రి కేబినెట్ లో లేరన్నారు. హైడ్రా పేరుతో హడావుడి చేసిన ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఘోరంగా విఫలం అయ్యాడన్నారు. పార్కులకు ఫెన్సింగ్ వేసి అదే గొప్ప అని హైడ్రా ప్రచారం చేసుకుంటోందన్నారు. హైడ్రా అంటే ఓ డ్రామా గా మారిందని ఆరోపించారు.
ఎస్ఆర్ డీపీ పనులపై రేవంత్ కు అవగాహన లేదన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణ అనేది పచ్చి మోసం, పూర్తిగా అశాస్త్రీయ పద్దతిలో నగరాన్ని మూడు ముక్కలు చేశారన్నారు. కార్పొరేషన్ మూడు భాగాలు చేసినప్పుడు మెట్రో వాటర్ బోర్డు ఎన్ని భాగాలు చెయ్యాలో చెప్పాలన్నారు. ప్రజల అవసరాల కంటే, ఆదాయం పైనే మక్కువ చూపిస్తున్నారని మండిపడ్డారు. పన్నులు వసూల్ చేసే శ్రద్ధ, ప్రజల అవసరాల తీర్చడంలో లేదన్నారు. అధికారం ఉన్నదని మున్సిపల్ ఎన్నికల్లో అరాచకం చేశారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు అనేది పచ్చిమోసం, అబద్దం అన్నారు. నేను చాలెంజ్ చేస్తున్న హైదరాబాద్ లో ఒక్క ఇల్లు అయిన నిర్మించారా , పొంగులేటి చూయించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల నుంచి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని రానున్న రోజుల్లో కాంగ్రెస్ గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Also Read: Nagachaitanya: అక్కినేని లెగసీపై నాగచైతన్య కామెంట్స్.. అస్సలు పోల్చుకోలేనంటూ!