KTR : ఇంత వరకూ వచ్చినా కేటీఆర్లో ఏమాత్రం మార్పు రాలేదు. ఆయన తీరు మారలేదు. మాటలు మారలేదు. ప్రవర్తన మారలేదు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు, హరీశ్రావుకు నోటీసులు ఇచ్చినా కేటీఆర్ మాత్రం తమ తప్పేమీ లేదన్నట్టు చెబుతున్నారు. కేసులకు భయపడేది లేదంటున్నారు. లొట్టపీసు కేసులతో ముఖ్యమంత్రి పీకేదేమీ లేదన్నారు కేటీఆర్. మీడియాతో చిట్చాట్లో ఇంకా చాలానే చెప్పారు.
కాంగ్రెస్ వాళ్లే బాంబు పెట్టారా?
కాంగ్రెస్ వాళ్లే మేడిగడ్డను బాంబుతో కూల్చి ఉంటారంటూ సెటైర్లు కూడా వేశారు కేటీఆర్. ఒక బ్యారేజీలో 2 పగుళ్లు వస్తే ఏదో అయినట్టు చేస్తున్నారని తప్పుబట్టారు. కమీషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కమిషన్ నోటీసులు ఇచ్చిందన్నారు. జస్టిస్ ఘోష్ విచారణ పూర్తి అయిందని చెప్పి.. ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నిజం నిలకడగా తెలుస్తుందని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డికి నిద్రపట్టకుండా హామీలపై తాము ప్రశ్నిస్తున్నామని.. అందుకే టాపిక్ డైవర్ట్ చేసేందుకే నోటీసులు డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు.
రేవంత్ అపరిచితుడా?
సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడిలా మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. రెమో క్యారెక్టరేమో అప్పు పుట్టడంలేదని అంటుంటే.. రాము క్యారెక్టర్ మాత్రం రూ.లక్షా 60వేల కోట్లు అప్పు చేశామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే ముఖ్యమంత్రి.. పాలమూరు ప్రాజెక్ట్ పక్కన పెట్టాడని కేటీఆర్ విమర్శించారు. ప్రజాపాలన కాస్త పర్సంటేజ్ పాలన అయిందన్నారు.
అందగత్తెలకు అంత ప్రయారిటీనా?
ఆకాల వర్షాలకు అన్నదాతలు ఆగమైతే.. అందాల పోటీలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మింగ మెతుకు లేదు గాని మీసాలకు సంపంగి నూనే కావాలంట.. అంటూ దెప్పిపొడిచారు. నెల రోజులుగా సీఎం మదిలో ఉన్నవి వరల్డ్ బ్యూటీస్, కేసీఆర్కు నోటీసులు మాత్రమేనని అన్నారు. తాము కట్టిన కట్టడాల ముందు ప్రపంచ అందగత్తెలు ఫోటోలు దిగుతున్నారని కామెంట్ చేశారు.
దొందు దొందేనా?
దున్నపోతు ఈనింది అంటే, దూడను కట్టేయండి అన్నట్లు బీజేపీ తీరు ఉందని కేటీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి న్యాయమూర్తులకు అర్థం అవుతుంది గానీ, అన్యాయ మూర్తులకు మాత్రం అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ దొంగలేనన్నారు కేటీఆర్. జూన్, జూలైలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులు ప్రారంభిస్తామని చెప్పారు.
Also Read : కేసీఆర్, హరీశ్రావు మళ్లీ మళ్లీ మీటింగ్స్.. అందుకేనా?
అందగాడు కేటీఆర్..
మిస్ వరల్డ్ కాంపిటీషన్పై కామెంట్స్ చేసిన కేటీఆర్కు తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి. కేటీఆర్ ఓ అందగాడని, ఒకప్పుడు హాలీవుడ్, బాలీవుడ్లో మెరిసిన తార అని సెటైర్లు వేశారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్లో కేటీఆర్ కనపడడం లేదని, ఏ ఫ్లెక్సీలో తన ఫోటో లేదని భాదపడుతున్నారని అన్నారు. తాను లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతోందని కేటీఆర్ అసూయ చెందుతున్నారన్నారు చామల.
కేటీఆర్లో ఫ్రస్టేషన్ అందుకేనా?
కేటీఆర్ మాటలు చూస్తే ఆయనలో అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు. మేడిగడ్డను కాంగ్రెస్ వాళ్లే బాంబుతో కూల్చి ఉంటారని అనడం పిచ్చ కామెడీగా ఉందని మండిపడుతున్నారు. కేసీఆర్ హయాంలో మేడిగడ్డ బ్యారేజ్ పగిలితే.. కాంగ్రెస్ వాళ్లు బాంబు పెట్టారని ఇప్పుడు అనడం చూస్తుంటే.. కేటీఆర్ ఫ్రస్టేషన్ ఏ రేంజ్లో ఉందో తెలిసిపోతోందని హస్తం నేతలు ఫైర్ అవుతున్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ కేసీఆర్, హరీశ్రావులకు నోటీసులు ఇవ్వడాన్ని తట్టుకోలేక పోతున్నారని అందుకే ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. త్వరలోనే అరెస్టులు కూడా ఉంటాయనే ప్రచారంతో కేటీఆర్ అవుటాఫ్ కంట్రోల్ అవుతున్నారని.. పిచ్చి వాగుడు వాగుతున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు సైతం ఎదురుదాడికి దిగుతున్నారు.