మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. క్యాతనపల్లిలో మంత్రి వివేక్ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి స్వయంగా అధికారులపై ఒత్తిడి తెస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్ను ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా బందిపోట్ల మాదిరిగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్యకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఒక దళిత నాయకుడి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు గర్హనీయమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం తీరుపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారని విమర్శించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రిటర్నింగ్ ఆఫీసర్లు సైతం కాంగ్రెస్ నాయకుల కళ్లసైగలకు తలొగ్గి పని చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి తప్ప రాజకీయ నేతల కనుసన్నల్లో కాదని హితవు పలికారు. బాల్క సుమన్తో పాటు పార్టీ సీనియర్ నేతలను అలాగే కార్యకర్తలను పోలీసులు వేధించడం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
అధికార పార్టీ నేతలకు అడుగులకు మడుగులోత్తుతున్న అధికారులను కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పుడు మంత్రి అక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి భవిష్యత్తులో తగిన ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించి పని చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ శ్రేణులు వెనక్కి తగ్గవని ధీమా వ్యక్తం చేశారు. బాల్క సుమన్ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ పార్టీ తరపున పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ వివరించారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇటువంటి అరెస్టులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురి చేయడం ద్వారా లబ్ధి పొందాలని కాంగ్రెస్ చూస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజా క్షేత్రంలో ఓటమి భయంతోనే ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒడిగడుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు.
ALSO READ: Balka Suman: మున్సిపల్ పీఠంపై ముదురుతున్న పోరు.. బాల్క సుమన్ అరెస్ట్