ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు మరింత పెంచింది. వీలైనంత త్వరగా విచారణను ముగించి నిందితులు ఎవరు అనేది తేల్చాలని చూస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిట్ ముందుకు సాగుతున్నట్టు తెలుస్తున్నది. పాత సిట్ స్థానంలో నగర సీపీ సజ్జనార్కు బాధ్యతలు అప్పగించిన రేవంత్ ప్రభుత్వం.. ఈ ఏడాది మార్చిలోగా విచారణను పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించినట్టు సమాచారం.అందుకే ఆయన దూకుడుగా ముందుకు వెళ్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొన్నటివరకు నెమ్మదిగా సాగిన సిట్ విచారణ..ప్రస్తుతం సూపర్ స్పీడ్తో సాగుతున్నది.
ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ అధికారులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, మీడియా చానెల్ ఎండీ శ్రవణ్ రావులను విచారించిన సిట్.. మూడ్రోజుల కిందట మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించిన విషయం తెలిసిందే.ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరి ప్రమేయం ఎంత మేర ఉన్నదనే విషయంపై ఆరా తీసినట్టు తెలిసింది.సెక్షన్ 160సీఆర్పీసీ కింద వారిని సాక్షులుగానే సిట్ అధికారులు విచారించారు. అయితే, దీనివెనుక సిట్ వ్యూహత్మక అడుగు ఉన్నట్టు తెలుస్తున్నది. సాక్షులుగా విచారించి వారిని నిందితులుగా మార్చే కోణంలోనే ఈ మేరకు నోటీసులు ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది.
కేటీఆర్, హరీశ్ రావులను విచారించిన సిట్ వారి స్టేట్మెంట్ రికార్డు చేసింది.త్వరలోనే కల్వకుంట్ల కవిత, ఆమె భర్త, జోగినిపల్లి సంతోష్ రావులకు సైతం నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. వారి స్టేట్మెంట్స్ సైతం రికార్డు చేశాక..మరోసారి కేటీఆర్, హరీశ్ రావులను విచారించి.. పాతది, కొత్త వాంగ్మూలం క్రాస్ చేయాలని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందులో వీరు చెప్పే సమాధానాలకు పొంతన కుదరకపోతే ..ఏ చిన్న సాక్ష్యాధారం దొరికినా సాక్షులుగా ఉన్న హరీశ్ రావు, కేటీఆర్లను నిందితులుగా పేర్కొంటూ అరెస్టు చేసే అవకాశం లేకపోలేదని రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ లీగల్ టైం సైతం ముందే గ్రహించి కేటీఆర్, హరీశ్ రావు విచారణ సందర్భంగా తమను వారితో పాటు లోనికి అనుమతించపోవడంపై సిట్ అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నట్టు తెలిసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నాటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. అయితే, ఆయనకు సుప్రీంకోర్టు కల్పించిన ఇంటెరిమ్ ప్రొటెక్షన్ మార్చి 10 వరకు ఉన్నది. అప్పటివరకు పోలీసులు ఆయన్ను కేవలం విచారించాలి కానీ రఫ్గా హ్యాండిల్ చేయరాదు. ఒకవేళ తమను కూడా సిట్ అరెస్టు చేస్తుందని భావిస్తే బీఆర్ఎస్ పెద్దలు సైతం కోర్టు ద్వారా ప్రొటెక్షన్ పొందగలరు. అందుకే మార్చి 10లోపు నిందితులను కనుగోనాలని సిట్ అధికారులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. పక్కా ఆధారాలతో మాజీ పోలీసులు అధికారులు, వారికి ట్యాపింగ్ పరికరాలు సమకూర్చిన వారు.. ఆదేశాలు ఇచ్చిన వారిని అరెస్టు చేయాలని సిట్ పకడ్బందీగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తున్నది.