KTR: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీల్లో 60 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించగా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 12 స్థానాల్లో గెలుపొందింది. సుమారు 34 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.
ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల్లో వీరోచితంగా పోరాటం చేశాయని ఆయన కొనియాడారు. దాదాపు 15-16 మున్సిపాలిటీల్లో నేరుగా విజయం సాధించామని, మరో 15-16 చోట్ల అతిపెద్ద పార్టీగా అవతరించామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 750 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారని, దాదాపు 30 శాతం మున్సిపాలిటీలను తాము గెలుచుకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, ఆ పార్టీ భారీగా అక్రమాలు, అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో పీఠాల కైవసం కోసం కాంగ్రెస్ పార్టీ అప్పుడే బేరసారాలు, కొనుగోళ్లు మొదలు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. అటువంటి చోట్ల కాంగ్రెస్ మరిన్ని అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, భాజపా కుమ్మక్కు అయ్యాయని విమర్శించిన ఆయన, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని పల్లెలు, పట్టణాల్లో ప్రజలు మరోసారి తేల్చి చెప్పారని అన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ సహా ఇతర కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు పోతామని స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కలిసొచ్చే తటస్థ అభ్యర్థులను కలుపుకొని పోయేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని తెలిపారు.
కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో కాంగ్రెస్ను దీటుగా ఎదుర్కొనే శక్తి కేవలం బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో సమీకరణాలు ఎవరికి అనుకూలంగా మారుతాయో వేచి చూడాలని అన్నారు. పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు, నాయకులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికైన కౌన్సిలర్లు ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.