Telangana Economy: స్వేచ్ఛ బ్యూరోొ: తెలంగాణను ‘ఎగువ మధ్య-ఆదాయ’ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ బ్యాంక్ గుర్తించడం మాజీ సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి, పరిపాలనా దక్షతకు దక్కిన అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4.19 లక్షల (5,407 అమెరికన్ డాలర్లు) తలసరి ఆదాయంతో తెలంగాణ.. ప్రపంచ బ్యాంక్ ఎగువ మధ్య-ఆదాయ కేటగిరీలో చేరిందని, ఈ మైలురాయిని సాధించిన ఐదు భారతీయ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో తెలంగాణ సాధించిన అసాధారణ ఆర్థిక పరివర్తనకు ఈ విశేష విజయమే అద్దం పడుతోందన్నారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఆర్థిక పరివర్తనను ప్రపంచ బ్యాంకు సైతం ధ్రువీకరించడం కేవలం ఒక గణాంక విజయం మాత్రమే కాదని, కేసీఆర్ దార్శనికత, నిబద్ధత, పాలనా నమూనాకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు అని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ, కేవలం పదేళ్ల వ్యవధిలోనే తన ఆర్థిక తలరాతను తిరగరాసుకుని దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించిందని గుర్తు చేశారు.
Also Read: Homemade Wine: యూట్యూబ్ చూసి వైన్ తయారీ.. ఏకంగా 377 లీటర్లు, చివరికి ఎలా దొరికిపోయారంటే?
పారిశ్రామికంగా, ఆర్థికంగా సుదీర్ఘకాలం పాటు అనుకూలతలు ఉన్న ఇతర రాష్ట్రాల వలె కాకుండా, దార్శనిక నాయకత్వం, సాహసోపేతమైన సంస్కరణలు, వినూత్న పాలన ద్వారానే తెలంగాణ ఈ మైలురాయిని చేరుకుందని పేర్కొన్నారు. పారిశ్రామిక అనుమతుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి అపూర్వమైన పెట్టుబడులను ఆకర్షించిన టీఎస్-ఐపాస్ తో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మిళిత వృద్ధికి, వ్యవసాయాభివృద్ధికి, పారిశ్రామిక విస్తరణకు, మెరుగైన ఉపాధికి బలమైన పునాది వేశాయని వివరించారు. యథాతథ స్థితిని సవాల్ చేయడానికి ఒక సంస్కర్త, అపూర్వమైన ఫలితాలను అందించడానికి ఒక కార్యదక్షుడు, ఒక రాష్ట్ర తలరాతను పూర్తిగా మార్చివేయడానికి ఒక నిజమైన మార్గదర్శి అవసరమని, ఈ లక్షణాలే కేసీఆర్ పాలనను నిర్వచిస్తాయని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధి నమూనా ప్రపంచస్థాయి విశ్వసనీయతను సంపాదించుకుందనడానికి ప్రపంచ బ్యాంకు గుర్తింపే మరో నిదర్శనమని అన్నారు.
ఎన్నికల హామీలను నెరవేర్చడంలో తమ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రంగా చిత్రించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందంటూ పదేపదే తప్పుడు చిత్రాన్ని చూపేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆర్థిక సూచీల సాక్షిగా పూర్తిగా బట్టబయలు అయ్యాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో సృష్టించబడిన బలమైన ఆర్థిక పునాదిపై నిర్మితమైన రాష్ట్రం తెలంగాణ అని ప్రపంచ బ్యాంక్ గుర్తింపు మరోసారి నిరూపించిందని నొక్కిచెప్పారు. దార్శనికత, పనితీరుతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన ప్రభుత్వానికి, తప్పుడు ప్రచారాలతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్న ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో తెలుసునని స్పష్టం చేశారు.
Also Read: NIA Raids: ఎన్ఐఏ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. ఉగ్రసంస్థలతో హైదరాబాద్ మహిళకు లింక్..?