Warangal Micro Artist: వరంగల్కు చెందిన ఓ మైక్రో ఆర్టిస్ట్ (సూక్ష్మ కళాకారుడు) సృష్టించిన అద్భుతం ఇప్పుడు భూమి సరిహద్దులు దాటి అనంత విశ్వంలోకి అడుగుపెట్టబోతోంది. మన దేశ గర్వకారణమైన శాస్త్రవేత్తల ప్రతిరూపాలు త్వరలోనే అంతరిక్షంలో విహరించనున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ ‘మ్యాదం అజయ్ కుమార్’ రూపొందించిన సూక్ష్మ కళాఖండాలకు ఈ అరుదైన, చారిత్రాత్మక గౌరవం దక్కింది.
దేశీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace)’ నిర్మించిన ‘విక్రమ్-1 (Vikram-1’ రాకెట్ ద్వారా ఈ మైక్రో ఆర్ట్స్ అంతరిక్షంలోకి ప్రయాణించనున్నాయి. ఈ విషయాన్ని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
సూది రంధ్రంలో సైన్స్ దిగ్గజాలు
కంటికి కూడా సరిగ్గా కనిపించని ఓ చిన్న సూది రంధ్రంలో (Eye of a needle) అజయ్ కుమార్ మన దేశ శాస్త్ర సాంకేతిక రంగాల పితామహుల ప్రతిరూపాలను ప్రాణం పోసినట్టుగా చెక్కారు. భారత్కు నోబెల్ తెచ్చిన సర్ సీవీ రామన్, అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్, మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహానుభావుల సూక్ష్మ ప్రతిరూపాలు ఇప్పుడు విక్రమ్-1 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్నాయి.
మూడేళ్ల నిరంతర శ్రమ.. 140 గంటల తపస్సు
ఈ అద్భుతాన్ని ఆషామాషీగా సృష్టించలేదు. 2023లో ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించిన అజయ్ కుమార్, 2026 ఫిబ్రవరి వరకు నిరంతరాయంగా శ్రమించారు. దాదాపు 140 గంటల పాటు అత్యంత ఏకాగ్రతతో, శ్వాసపై నియంత్రణ ఉంచుకుంటూ ఈ ప్రతిరూపాలను చెక్కారు. దీనికోసం ఆయన స్టెయిన్లెస్ స్టీల్, 24 క్యారెట్ల బంగారం, వెండి, సిరామిక్ పొడి, కార్బన్ ఫైబర్ పొడి వంటి ప్రత్యేకమైన పదార్థాలను ఉపయోగించారు.
Also Read: ఇక అంతా ఈవీల రాజ్యమేనా? జూన్ సేల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
జూలై 12 నుండి స్పేస్ జర్నీ
ఈ సూక్ష్మ కళాఖండాల అంతరిక్ష ప్రయాణం ఈ నెల (జూలై) 12వ తేదీన ప్రారంభమై, ఆగస్టు 4వ తేదీ వరకు సాగనుంది. దాదాపు 20 రోజులకు పైగా ఇవి అంతరిక్షంలోనే ఉండి తిరిగి రానున్నాయి.
ప్రపంచంలోనే మూడోసారి.. భారత్ నుండి తొలిసారి!
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో మైక్రో ఆర్ట్స్ స్పేస్లోకి వెళ్లడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. గతంలో అమెరికాకు చెందిన ‘మూన్ మ్యూజియం’, ‘ఫాలెన్ ఆస్ట్రోనాట్’ మైక్రో ఆర్ట్స్ మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లాయి. ఇప్పుడు ఆ రికార్డుల సరసన మన వరంగల్ ఆర్టిస్ట్ అజయ్ కుమార్ కళాఖండాలు నిలిచాయి. అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి భారతీయ సూక్ష్మ కళాఖండంగా ఇది సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది.
40 ఏళ్ల నా సాధనకు దక్కిన గౌరవం
ఈ సందర్భంగా మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘గత 40 ఏళ్లుగా నమ్ముకున్న నా సూక్ష్మ కళకు ఇప్పుడు ప్రపంచ స్థాయిలోనే కాకుండా, విశ్వం స్థాయిలో గుర్తింపు రావడం నా జీవిత ధన్యత. నా కళాఖండాలు అంతరిక్షంలోకి వెళ్తుండటం మాటల్లో చెప్పలేనంత గర్వంగా ఉంది’ అని భావోద్వేగానికి గురయ్యారు.
అంతరిక్షంలోకి వరంగల్ మైక్రో ఆర్ట్
వరంగల్ మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ రూపొందించిన అద్భుత సూక్ష్మకళాఖండాలు స్కైరూట్ ఎరోస్పేస్ 'విక్రమ్-1' రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్నాయి. సూది రంధ్రంలో రూపొందించిన భారతీయ శాస్త్రవేత్తల ప్రతిరూపాలకు ఈ అరుదైన గౌరవం దక్కింది.… pic.twitter.com/3AYu2NW8ic
— BIG TV Breaking News (@bigtvtelugu) July 8, 2026