Hyderabad Crime: భర్తతో ఉన్న విభేధాల పరిష్కారం కోసం ఓ టీవీ షోలో పాల్గొనటానికి వచ్చిన మహిళపై ఇద్దరు అఘాయిత్యం జరిపారు. ఈ ఘటన హైదరాబాద్ లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ మహిళకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లయ్యింది. అయితే, రెండు సంవత్సరాలుగా భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో భరించలేక పోయిన ఆమె విడిగా ఉంటోంది.
అయితే ఈ తరహా వివాదాలను పరష్కరించే ఓ టీవీ ఛానెల్ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యను పరిష్కరించుకోవాలని మహిళ భావించింది. ఇందుకోసం నగరానికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు పరిచయమైన ఓ వ్యక్తి టీవీ షో నిర్వాహకులు తనకు బాగా తెలుసని చెప్పి నమ్మించాడు. తనతోపాటు వస్తే వారి వద్దకు తీసుకెళతానన్నాడు.
అనంతరం బాధితురాలిని సికింద్రాబాద్ రాణిగంజ్ ప్రాంతంలోని హైదర్ కాంప్లెక్స్ కు తీసుకెళ్లాడు. అక్కడ బెదిరించి మహిళపై అత్యాచారం జరిపాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మరో వ్యక్తి కూడా బాధితురాలిపై లైంగిక దాడి జరిపాడు. దాంతో బాధితురాలు గట్టిగా కేకలు పెట్టగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన మహంకాళి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ఇదేందయ్యా ఇది.. తాటిచెట్టుకు ఇనుప మెట్లా? ఈ రైతు తెలివికి సెల్యూట్!