KTR Criticism: హైదరాబాద్ నగరాన్ని గత రెండేళ్ల పాలనతో అధఃపాతాళానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు పోయిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం తన ఆర్థిక ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసం మాత్రమే సీఎం పరిపాలన చేస్తున్నారన్నారు. అందుకే హైదరాబాద్ నగరంలో భూములే లక్ష్యంగా అక్రమ సంపాదన కోసమే పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని పతనానికి పడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో శనివారం జీహెచ్ఎంసీ నగర పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో కేటీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రూ.వేల కోట్ల రూపాయలను రాష్ట్ర రాజధాని నుంచి దోచుకోవడానికి ‘హైడ్రా’ నుంచి మొదలుకొని పారిశ్రామిక భూముల స్కామ్, టీడీఆర్ స్కామ్, ఫోర్త్ సిటీ భూముల కుంభకోణానికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి 24 నెలలుగా చేసింది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని అన్నారు. రాష్ట్ర రాజధానిలో కనీసం దోమల నివారణ కూడా చేయలేనంత దుర్మార్గమైన పరిపాలనా వైఫల్యం నెలకొని ఉందని విమర్శించారు. నగరంలో 10 సంవత్సరాల క్రితం ఎప్పుడూ లేనటువంటి కరెంట్ కోతలు, మంచినీటి ఇబ్బందులు, పారిశుధ్య సమస్యలు అన్ని తిరిగి రాష్ట్ర రాజధానిలో దర్శనమిస్తున్నాయన్నారు.
సీఎం రేవంత్ అవగాహన రాహిత్యంతో అక్రమ సంపాదన లక్ష్యంగా తన భూములకు విలువ తీసుకురావడం కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో ఉన్న సిటీని పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రం నుంచి మొదలుకొని ఇతర దేశాలకు ఎక్కడ వెళ్లినా కూడా హైదరాబాద్ గురించి మాట్లాడకుండా కేవలం తన స్వప్రయోజనాల కోసం ఫ్యూచర్ సిటీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారని అన్నారు. ఉన్న హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పన చేయకుండా కనీస పౌర సేవలు అందించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో తిరోగమనంలోకి తీసుకువెళ్తుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి మెట్రో నగరంగా తీర్చిదిద్దామన్నారు. కరెంట్ కోతలు లేకుండా తాగునీరు, పారిశుధ్యం నుంచి మొదలుకొని ప్రజా రవాణా వరకు అన్ని రంగాల్లో నగరాన్ని ముందుకు తీసుకుపోయామని గుర్తు చేశారు. అందుకే ప్రజలు రెండు సార్లు రాష్ట్ర రాజధానిలో మేయర్ పీఠాన్ని తమ పార్టీకి కట్టబెట్టారన్నారు.
Also Read: CM Chandrababu: మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు, ఉచిత విద్య
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరంలో సొంతంగా మేయర్ పీఠం పైన గులాబీ జెండాను ఎగురవేశామని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన అరాచకాలతో, అవినీతితో పట్టణాన్ని పూర్తిగా పండబెట్టిందని తెలంగాణ ఆర్థిక ఇంజన్ను కూలగొట్టిందని కేటీఆర్ ఆరోపించారు. నగరంలో రియల్ ఎస్టేట్ను నగర ఆర్థిక వ్యవస్థను, వ్యాపార అవకాశాలు అన్నింటినీ కుప్పకూల్చిందన్నారు.
Also Read: Mosquito Bite: దోమలు.. మనుషుల రక్తాన్ని టేస్ట్ చేసింది అప్పుడేనట, మరి అంతకు ముందు?