KTR: కరీంనగర్ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉద్దేశపూర్వకంగానే బదనాం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ‘క్రిమినల్ నెగ్లిజెన్సీ’ వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నీ సక్కగానే ఉన్నాయని, కేవలం సీఎం బుర్రే సరిగా పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ను నడపడం లేదని, ఒక సర్కస్ను నడుపుతున్నారని విమర్శించారు.
లక్ష క్యూసెక్కుల నీరు వృధా..
మేడిగడ్డ దగ్గర లక్ష క్యూసెక్కుల నీరు కళ్లముందే వృధాగా సముద్రం పాలవుతున్నా, ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడం లేదని కేటీఆర్ ఆరోపించారు. రోజుకు దాదాపు 9 టీఎంసీల నీరు వృధా పోతుంటే, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నీళ్లు లేక నోరెళ్లబెడుతున్నాయన్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ, లోయర్ మానేర్, మిడ్ మానేర్ వంటి ఏ ప్రాజెక్టులోనూ 20 శాతం నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీటి మట్టం 93 మీటర్లు దాటితే చాలు మోటార్లు ఆన్ చేయవచ్చని, ప్రస్తుతం 97 మీటర్ల ప్రవాహం ఉన్నా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లడం లేదని తప్పుపట్టారు.
మేడిగడ్డతో సంబంధం లేకుండానే లిఫ్ట్ చేయవచ్చు
మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంపులను సమన్వయంతో నడపవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు 2024లోనే గ్రౌటింగ్ పనులు పూర్తి చేశారని, అక్కడ పరిమిత సంఖ్యలో నీటిని నిలిపి లిఫ్ట్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని రిటైర్డ్ ఇంజనీర్లు సైతం చెప్తున్నారన్నారు. రాబోయే వంద రోజుల్లో కన్నెపల్లి దగ్గర ప్రవాహం ఉంటుందని, రోజుకు 2-3 టీఎంసీలు ఎత్తిపోసినా.. ఎస్సారెస్పీతో సహా అన్ని ప్రాజెక్టులను నింపి 200 నుంచి 300 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని సూచించారు. అలా చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.
Also Read: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్కుమార్ ఆత్మహత్య!
శిఖండి రిపోర్టుతో కేసీఆర్ పై బదనాం
‘కేవలం పరీక్షలు చేయకుండా 48 గంటల్లో ఇచ్చిన NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదిక ఒక శిఖండి రిపోర్ట్. అది ఎన్డీఏ ఇచ్చిన రిపోర్టు. బీజేపీ ఇచ్చిన ఆ నివేదికను పట్టుకుని కేసీఆర్ను బదనాం చేస్తున్నారు. కట్టుకున్న ఇల్లు కురిస్తే సర్దుకుంటారు కానీ కూలగొట్టుకుంటారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
తాగునీటి తిప్పలు.. పవర్ ప్లాంట్లకు ముప్పు
శ్రీపాద ఎల్లంపల్లిలో కూడా నీరు లేకపోతే హైదరాబాద్ నగరానికి, అలాగే కరీంనగర్లోనూ తాగునీటి తిప్పలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికే హైదరాబాద్లో ప్రజలు ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కుంటున్న పరిస్థితి ఉందన్నారు. పంటలు పండితే రైతులకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే ప్రభుత్వం నీరివ్వడం లేదని ఆరోపించారు. నీటి కొరత వల్ల ఎన్టీపీసీ, జైపూర్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మా రక్తంతో సీఎం కళ్లు శాంతిస్తాయా?
రైతుల కోసం అధికారులు సలహా ఇస్తే జైల్లో వేస్తామంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి భాష చిల్లరగా ఉందని కేటీఆర్ విమర్శించారు. ‘మా రక్తం చల్లితేనే పంటలు పండుతాయి’ అని సీఎం అన్నందుకే తాము చాలా చోట్ల రక్తదానం చేశామని, ఆ రక్తాన్ని సీఎంకు ఇవ్వడానికి వెళ్తుంటే బీఆర్ఎస్ నాయకులను అడుగడుగునా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. మా రక్తమే కావాలనుకుంటే.. అది చూసి మీ కళ్ళు శాంతిస్తాయి అనుకుంటే అందరం రక్తం పంపడానికి సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం వెంటనే మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: రేవంత్ కోసమే సీమ ప్రాజెక్టును చంద్రబాబు ముంచేశారు.. సజ్జల సంచలనం!