HILT Policy: స్వేచ్య బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాలను పునరుద్ధరించి, ఆధునీకరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘హిల్ట్ (HILT) పాలసీ’ ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. పరిశ్రమల యజమానుల నుంచి స్పందన కరువవ్వడంతో ఈ విధానం కాస్తా ‘ఫల్టీ’గా మారుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ, దరఖాస్తులు చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను బయటకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. పారిశ్రామిక వాడలను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు తీసుకొచ్చిన ఈ పాలసీని ముందుకు సాగడం లేదు. రిజిస్ట్రేషన్ రేట్ల గందరగోళం, పరిశ్రమల యజమానుల నుంచి వ్యతిరేకత, రాజకీయ వివాదాలు కారణమని సమాచారం. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల ఉన్న బాలానగర్, కాటేదాన్, కూకట్పల్లి, ఉప్పల్, జీడిమెట్ల తదితర 22 పారిశ్రామికవాడల్లోని 9,292 ఎకరాల్లో ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించడం హిల్ట్ పాలసీ ప్రధాన ఉద్దేశం. ఖాళీ అయ్యే 9,292 ఎకరాలను వాణిజ్య, నివాస భవనాలు, విద్యాసంస్థలు మొదలైనవాటితో బహుళ వినియోగ జోన్లుగా మారుస్తారు. పారిశ్రామిక భూములను బహుళ వినియోగ (మల్టీ-యూజ్) జోన్లుగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం హిల్ట్ పాలసీని తెచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల (మార్కెట్ రేట్లు) పెంపునకు సిద్ధమవడంతో, హిల్ట్ పాలసీ కింద ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాలనుకునే వారికి భారం పెరిగే అవకాశం ఉన్నట్లు పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనిని అధిగమించడానికి ప్రభుత్వ తాత్కాలిక రాయితీ సైతం కల్పించింది. క్యాబినెట్ సబ్-కమిటీ సిఫార్సుల మేరకు జూన్ 30, 2026 లోపు దరఖాస్తు చేసుకునే వారికి పాత ఎస్ఆర్ఓ (ఎస్ఆర్ఓ) రేట్లనే వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.కానీ పారిశ్రామిక వేత్తల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదని సమాచారం.
Also read: నల్లగొండలో ఆర్జాలబావి.. ఈ పేరు వెనుక ఇంత ఆసక్తికరమైన చరిత్ర ఉందా?
భూముల వినియోగాన్ని మార్చడానికి ప్రభుత్వం విధించిన ‘డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు (డీఐఎఫ్)’ చాలా ఎక్కువగా ఉందని పరిశ్రమల సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ భూములు దశాబ్దాల క్రితం తాము కొనుగోలు చేసిన సొంత భూములని, వీటిని ఖాళీ చేసి తరలిపోవడం వల్ల ఉత్పత్తి దెబ్బతింటుందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. అందుకే భూముల మార్పిడికి పరిశ్రమల యజమానులు పెద్దగా ముందుకు రాలేదు. కంపెనీలు ఉన్న భూములన్నీ తమ సొంతమని, వాటిని 30-40 ఏళ్ల క్రితమే తీసుకున్నామని చెప్పారు.రియల్ ఎస్టేట్ సైతం ఆశాజనకంగా లేకపోవడంతో హిల్ట్ పాలసీ కింద దరకాస్తు చేసుకునేందుకు పరిశ్రమల యజమానులు సైతం విముఖత చూపుతున్నారు. ఉత్పత్తి సాగించే పరిశ్రమల స్థానంలోనే మల్టీ యూజ్ జోన్ ఏర్పాటు చేస్తే లాభదాయకమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమలన్నీ ఒకేసారి తరలివెళ్తేనే మల్టీ యూజ్ జోన్ గా మార్చడం సాధ్యమవుతుంది.
ప్రభుత్వం హిల్ట్ పాలసీని గతేడాది సెప్టెంబర్ లో ఆమోదించింది.జూలై ప్రారంభమైనప్పటికీ పాలసీ పూర్తి స్థాయి మార్గదర్శకాలపై స్పష్టత రాలేదని సమాచారం. పరిశ్రమల యజమానుల డిమాండ్లు, రాయితీలు, ఫీజుల తగ్గింపు అంశాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మేలో మంత్రి ఉపసంఘం భేటీ అయింది. జూన్ నెలాఖరు వరకు హిల్ట్ పాలసీ కింద దరఖాస్తు చేసుకునే వారికి పాత మార్కెట్ విలువలతోనే లెక్కించిన డెవల్పమెంట్ ఇంపాక్ట్ ఫీజును చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. భూముల రిజిస్ట్రేషన్ ధరల వల్ల ‘డెవల్పమెంట్ ఇంపాక్ట్ ఫీజు’ పెరగకుండా ఈ మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. ఓఆర్ఆర్ బయట ఉన్న పారిశ్రామిక లే అవుట్లలో ఈ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఓఆర్ఆర్ అవతలకు పరిశ్రమలను తరలిస్తే.. ఉద్యోగులు కూడా అక్కడికి వెళ్లేలా కొన్ని రాయితీలు కల్పించాలన్న నిర్ణయాన్ని కూడా ఉపసంఘం తీసుకున్నట్లు సమాచారం. అయితే గడువు ముగిసింది. ఆశించిన స్థాయిలో పారిశ్రామిక వేత్తల నుంచి రావడం లేదని సమాచారం.
మరో వైపు హిల్ట్ పాలసీ మార్గదర్శకాలపై హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో, న్యాయపరమైన చిక్కులు కూడా ఈ పాలసీ వేగాన్ని తగ్గించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితిలో పాలసీ ముందుకు సాగని క్రమంలో, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను లాంచ్ చేశారు. పరిశ్రమల సంఘాలతో వరుస సమావేశాలు (ఐలాప్రతినిధులతో చర్చలు) జరుపుతూ, అప్లికేషన్ల స్క్రూటినీ కమిటీలను ఏర్పాటు చేసి ప్రక్రియను సరళతరం చేసేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని సమాచారం. పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి రాయితీలు ఇచ్చి ఈ పాలసీని ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి.
Also read: Road Encroachments: సర్కారు భూమిలో అక్రమ గోడ నిర్మాణం.. పట్టించుకోని అధికారులు!