Shabad Murder: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసి పరారైన నిందితుడు రాజ్ కుమార్ కథ విషాదాంతమైంది. స్థానికుల నుంచి అందిన సమాచారంతో పోలీసులు అతని మృతదేహాన్ని కొత్తూరు సమీపంలో కనుగొన్నారు. కొత్తూరు మండలం పంజర్ల పరిధిలోని ఒక ఓపెన్ వెంచర్లో రాజ్ కుమార్ శవమై కనిపించాడు. మృతదేహం పక్కనే పురుగుల మందు బాటిల్ లభ్యం కావడంతో, అతడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పంజర్ల వెంచర్లో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, అది షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ దేనని అధికారికంగా ధ్రువీకరించారు. ఆరుగురి ప్రాణాలను బలిగొన్న నిందితుడు, పోలీసులకు దొరకకుండా ఇలా చనిపోవడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.