Hyderabad Bonalu 2026: హైదరాబాద్ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాతబస్తీలో పర్యటించారు. ముందుగా చారిత్రక చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం నాంపల్లిలోని ప్రసిద్ధ ఏడు గుళ్ళ పోచమ్మ ఆలయానికి చేరుకున్న కేటీఆర్, తలసాని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికి, తీర్థప్రసాదాలను అందజేశారు. బోనాల పండగ సందర్భంగా వివిధ ఆలయాలను సందర్శించడం, భక్తులతో కలిసి వేడుకల్లో పాలుపంచుకోవడం తనకి ఎంతో ఆనందాన్నిస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీలను వారు అభినందించారు. అంతే కాకుండా ఈ పండగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, ప్రతి ఏటా ఈ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని తెలిపారు